న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై లోక్సభ సెక్రటేరియేట్(Loksabha Secretariat) అనర్హత వేటు వేయడంతో ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయింది. ప్రధాని మోదీని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన క్రమంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. తనపై అనర్హత వేటు వేసిన క్రమంలో వయనాడ్ ఎంపీ స్పందించారు.
దేశం కోసం గొంతువిప్పేందుకు తాను పోరాడతానని, ఈ క్రమంలో ఎలాంటి మూల్యం చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల ముందుకు కర్నాటకలో రాహుల్ మాట్లాడుతూ దొంగలందరికీ మోదీ ఇంటి పేర్లే ఎందుకు ఉంటాయని ప్రశ్నించడం దుమారం రేపింది. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు.
ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో ఆయనపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేండ్లు లేదా అంతకుమించి జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెల్లడైన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి అర్హత కోల్పోతారు.
జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేండ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వారు అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలితే వారిని తక్షణమే అనర్హులుగా పరిగణించాలని 2013లో సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మరోవైపు అనర్హత వేటును నిరోధించేందుకు దిగువ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాల్సిందిగా రాహుల్ అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తారని కాంగ్రెస్ పేర్కొంది.
Read More :