Rahul Gandhi : పంజాబ్లో మూక దాడుల ఘటనపై ప్రశ్నించినందుకు మీడియాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కొమ్ముకాయడం మానుకోండి..అంశాన్ని దృష్టిమళ్లించే ప్రయత్నం చేయకండని మీడియా ప్రతినిధులకు చురకలు వేశారు. కాంగ్రెస్ పాలిత పంజాబ్లోని అమృత్సర్, కపుర్తలాలో సిక్కుల ప్రార్ధనాలయాలను అపవిత్రం చేశారని ఇద్దరు వ్యక్తులపై మూకదాడికి పాల్పడిన ఘటనల నేపధ్యంలో రాహుల్ గాంధీ మీడియాపై ధ్వజమెత్తారు.
మరోవైపు 2014లో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చే వరకూ మూక దాడుల గురించి వినలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. సిక్కుల ఊచకోతను కాంగ్రెస్ సమర్ధించిందని, మూకహత్యలకు రాహుల్ తండ్రి లాంటి వాడని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎదురుదాడికి దిగారు. సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మారణహోమాన్ని కాంగ్రెస్ సమర్ధించిందని, కాంగ్రెస్ పార్టీ సిక్కు పురుషుల మెడకు కాలుతున్న టైర్లను చుట్టిందని, కాల్వల్లో పడేసిన దగ్ధమైన మృతదేహాలను కుక్కలు పీక్కుతిన్నాయని మాలవీయ పేర్కొన్నారు.