న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో భేటీ ముగిసిన మరుసటి రోజే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu) శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ను కలిశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే ఛాంపియన్గా ఖర్గేను సిద్ధూ అభివర్ణించారు.
సత్యాన్ని ఎలుగెత్తి చాటే గొంతుక ఖర్గే అని ప్రశంసలు గుప్పించారు. ఖర్గేను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని వెల్లడించిన సిద్ధూ పార్టీకి పెద్దాయన సానుకూల వాతావరణాన్ని, జోష్ను తీసుకువచ్చారని అన్నారు. 9 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా బలహీనవర్గాలు, దళితుల అభ్యున్నతికి పనిచేసిన ఛాంపియన్ ఖర్గే అని సిద్ధూ ట్వీట్ చేశారు. కాగా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సిద్ధూ గురువారం సమావేశమయ్యారు.
తనను అణిచివేయాలని చూసినా, జైల్లో ఉంచినా పంజాబ్ బాగు కోసం తన చిత్తశుద్ధిని ఎవరూ తగ్గించలేరని వారితో భేటీ ముగిసిన అనంతరం సిద్ధూ వ్యాఖ్యానించారు. 1988 ఘర్షణ కేసులో జైలు శిక్ష పూర్తవడంతో సిద్ధూ పటియాలా జైలు నుంచి ఏప్రిల్ 1న విడుడలయ్యారు. పది నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన సిద్ధూ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం బందిఖానలో ఉందని, వ్యవస్ధలను బానిసలుగా మార్చేశారని మోదీ సర్కార్ను సిద్ధూ దుయ్యబట్టారు.
Read More