ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే.. పెట్రో రేట్లు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదవాళ్ల కడుపులు కొడుతున్న మోదీ ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి వేలకోట్ల రూపాయలు దండుకుంటోందని ఖర్గే ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన..
‘‘లక్ష్యం సాధించినందుకు మోదీకి శుభాకాంక్షలు. ఆయన చాలా కష్టపడి ఎల్పీజీ సిలిండరు దరను వెయ్యి రూపాయలకు చేర్చారు. అదే ఆయన టార్గెట్. ఇక నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతిరోజూ వికాసం కనిపిస్తుంది’’ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో కమ్యూనలిజం, ద్వేషం మాత్రమే అందరికీ అందే స్థాయిలో ఉంటాయని, మిగతావన్నీ భారీ ధరలు పలుకుతాయని ఎద్దేవా చేశారు.