భోపాల్ : మతం అనేది రాజకీయ ప్రచారాంశం కాదని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. బీజేపీ మత విద్వేష రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల మధ్య చిచ్చు రేపుతుందని దుయ్యబట్టారు. కాషాయ పార్టీ విద్వేష అజెండాకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.
రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించాలన్నదే తమ పార్టీ అజెండా అని ఆయన స్పష్టం చేశారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారని, వారి కష్టాలు, ఇబ్బందులు తొలగించాలనేది తమ పార్టీ అభిమతమని అన్నారు. కాషాయ పార్టీ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.
కర్నాటక తరహాలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని కమల్ నాధ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 170కిపైగా స్ధానాలు గెలుపొంది పాలనా పగ్గాలు చేపడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు. కర్నాటకలో బీజేపీ ఓటమి ఆరంభం మాత్రమేనని వివిధ రాష్ట్రాల్లో తమ పార్టీ తిరిగి పాగా వేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Read More
Kavach | కవచ్కు 468 కోట్లు కేటాయిస్తే..పెసా ఖర్చు చేయలే