న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య కాంగ్రెస్ను కించపరిచే ప్రయత్నమని విమర్శించారు. రాజ్యసభ స్పీకర్, ప్రిసైడింగ్ అధికారిని అవమానించడం ఆపాలన్నారు. ఈ కేసులో ఖర్గే నిందితుడు కాదని, అయినప్పటికీ విచారణకు సహకరిస్తానని ఈడీకి హామీ ఇచ్చారని జైరాం రమేశ్ గుర్తు చేశారు.
అయితే, పార్లమెంట్ సమావేశాల జరుగని సమయంలో విచారణకు హాజరవుతారని చెప్పగా.. ఈడీ ఇందుకు అంగీకరించలేదు. పార్లమెంట్ సభ్యులను వేధింపుల నుంచి కాపాడాలని లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు జైరాం రమేశ్ విజ్ఞప్తి చేశారు. వైఐఎల్ కార్యాలయంలో శోధించడం, కేసులో ఆయన స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు పిలువడం వెనుక కాంగ్రెస్, మల్లికార్జున ఖర్గేలను కించపరచడమే ఏకైక ఉద్దేశమని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ఎంపీల గౌరవాన్ని, సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఉభయ సభల ప్రిసైడింగ్ అధికారులు సంప్రదింపులు జరిపి పార్లమెంటును, ఎంపీలను ఇలాంటి అవమానాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.