Gulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తమ్ముడి కొడుకు ముబాషిర్ ఆజాద్ ఆదివారం బీజేపీలో చేరారు. క్షేత్రస్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ఆకర్షితుడనై బీజేపీలో చేరుతున్నట్లు ముబాషిర్ చెప్పారు. తన పెద్దనాన్న గులాం నబీ ఆజాద్కు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇవ్వనందుకు తాను కలత చెందానని, ఆ పార్టీ నుంచి దూరం కావడానికి దారి తీసిందన్నారు. తాను బీజేపీలో చేరే విషయమై గులాం నబీ ఆజాద్తో చర్చించలేదని ముబాషిర్ ఆజాద్ తెలిపారు.
ముబాషిర్ అజాద్, ఆయన మద్దతుదారులకు జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, మాజీ ఎమ్మెల్యే దలీప్ సింగ్ పరిహార్ స్వాగతం పలికారు. ముబాషిర్ అజాద్ తమ పార్టీలో చేరడం దోడా, కిష్టావర్, రాందన్ జిల్లాల్లో తమ పార్టీకి టర్నింగ్ పాయింట్గా మారుతుంది రవీందర్ రైనా అభివర్ణించారు. హిందువులు, గుజ్జార్లు, బకర్వాలాలు, పహారీలు తదితర సామాజిక వర్గాల నుంచి, విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు భారీగా బీజేపీలో చేరుతున్నారన్నారు. 2009లో బీజేపీలో గులాం నబీ ఆజాద్ సోదరుడు గులాంఅలీ కూడా చేరారు.
ఈ సందర్భంగా ముబాషిర్ ఆజాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటల్లో ఉంది. తన పెద్దనాన్న వంటి చరిస్మా గల నేతల పట్ల కాంగ్రెస్ అధిష్టానం తీరు సామాన్యుల మనోభావాలను కించ పరిచిందన్నారు గులాం నబీ ఆజాద్ను ప్రధాని మోదీ ప్రశంసించారు గానీ, కాంగ్రెస్ పార్టీ ఆజాద్ను పక్కన బెట్టిందని చెప్పారు.