న్యూఢిల్లీ: వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉన్న అరకొర రాష్ట్రాలు కూడా దూరమవుతున్నాయి. దీంతో ఒక్కోనేత ఆపార్టీకి గుడ్బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనంద్ శర్మ (Anand Sharma) చేరారు. త్వరలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఆనంద్ శర్మ బీజేపీ అధినేత జేపీ నడ్డాను కలవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక కమల దళంలో చేరడమే తరువాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే మరికొన్ని నెలల్లో హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆనంద్ శర్మ ప్రస్తుతం హిమాచల్ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
కాగా, తాను పార్టీ మారుతున్నాన్న వార్తలను ఆనంద్ శర్మ ఖండించారు. ఎప్పటికీ తాను కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేశారు. జేపీ నడ్డాను కలవడం తన హక్కని, ఇద్దరి ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యమేమీ లేదని వెల్లడించారు. కాగా, ఇద్దరు నేతలు పార్టీ మార్పుపై చర్చించుకున్నారని సమారం.
పార్టీ అధినాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడిని నియమించాలని కోరుతున్న జీ-23 గ్రూప్లో ఆనంద్ శర్మ కూడా ఒకరు. ఇదే గ్రూప్లో ఉన్న మరో సీనియర్ నేత కపిల్ సిబల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.