బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో (Karnataka Assembly Elections) నిత్యావసరాల ధరల మంటను కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్ర్తంగా మలుచుకుంటోంది. వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఎన్నికల ప్రచారానికి ముందు తాము గ్యాస్ సిలిండర్ను ప్రార్ధించాలని కోరుకుంటున్నామని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ (కేపీసీసీ చీఫ్) డీకే శివకుమార్ పేర్కొన్నారు.
గ్యాస్ సిలిండర్ తమకు దేవుడితో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ప్రచారానికి వెళ్లే ముందు వారంతా తమతో పాటు గ్యాస్ సిలిండర్ను తీసుకువెళ్లాలని తాను కోరుతున్నానని చెప్పారు. మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు 189 మంది అభ్యర్ధులతో బీజేపీ ప్రకటించిన తొలి జాబితా కాషాయ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ రాని నేతలంతా పార్టీకి రాజీనామా చేస్తుండగా, మరికొందరు నిరసన వ్యక్తం చేయడం పార్టీ శ్రేణుల్లో అలజడి రేపుతోంది.
ఇక పార్టీ హైకమాండ్ తనకు టికెట్ నిరాకరించడంతో బీజేపీకి రాజీనామా చేసిన కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది హస్తం గూటికి చేరతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే లక్ష్మణ్ తనతో టచ్లో లేరని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పష్టం చేశారు. లక్ష్మణ్ తనను సంప్రదించలేదని, తాను కూడా ఆయనతో మాట్లాడలేదని చెప్పారు. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More