బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా కాషాయ పార్టీలో మంటలు రేపుతోంది. టికెట్ దక్కని నేతల రాజీనామాలు, నిరసనలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం జగదీష్ షెట్టార్ తనకు పార్టీ టికెట్ నిరాకరించడంతో తాడోపేడో తేల్చుకునేందుకు ఏకంగా అగ్రనేతలతో భేటీ అవుతుండగా టికెట్ కేటాయించకపోవడంతో మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది పార్టీకి రాజీనామా చేశారని సమాచారం.
ఇక బెంగళూర్ నగరంలోని జయానగర్ నుంచి పార్టీ టికెట్ లభించకపోవడంతో ఎన్ఆర్ రమేష్ వర్గీయులు 1200 మంది పార్టీని వీడారు. పార్టీ అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించిన వెంటనే రమేష్ వర్గీయులు నిరసనలకు దిగారు. ఇక రనెబెన్నూర్ స్ధానం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న ఎమ్మెల్సీ ఆర్ శంకర్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేయనున్నారు. రనెబెన్నూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు ఆయన సన్నద్ధమయ్యారు.
కాగా, బీజేపీ మంగళవారం రాత్రి 189 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో 52 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించారు. 32 మంది ఓబీసీ అభ్యర్ధులు, 30 మంది ఎస్సీ, 16 మంది ఎస్టీలకు స్ధానం లభించింది. బీజేపీ ప్రకటించిన తొలిజాబితా పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా, ఏకాభిప్రాయంతోనే అభ్యర్ధులను ఎంపిక చేశామని, తొలి జాబితాపై అందరూ సంతోషంగా ఉన్నారని సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More