బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఎట్టకేలకు విడుదల చేయగా టికెట్లు దక్కని నేతలు పార్టీ హైకమాండ్పై విరుచుకుపడుతున్నారు. మాజీ సీఎం జగదీష్ షెట్టార్ తనకు టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరొకరికి వీలు కల్పించేందుకు తనను పోటీ నుంచి తప్పుకోవాలని హైకమాండ్ సంకేతాలు పంపడంతో ఆయన కినుక వహించారు.
రాజీనామాకు సిద్ధపడటంతో బీజేపీ అధిష్టానం దిగివచ్చి ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు అంగీకరించింది. తొలి జాబితాలో సీటు దక్కని అగ్రనేతలు పార్టీ అగ్రనాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తనకు టికెట్ నిరాకరించడంతో కాషాయ పార్టీకి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది నిర్ణయించుకున్నారు. పార్టీ తనకు మొండిచేయి చూపిందని ఇక బీజేపీలో కొనసాగడం తనకు ఇష్టం లేదని ఆయన తన సన్నిహితులతో స్పష్టం చేశారు.
మరోవైపు బీజేపీ మంగళవారం రాత్రి 189 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. వీరిలో 52 మంది కొత్త ముఖాలకు చోటు కల్పించారు. 32 మంది ఓబీసీ అభ్యర్ధులు, 30 మంది ఎస్సీ, 16 మంది ఎస్టీలకు స్ధానం లభించింది. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More