INDIA alliance | న్యూఢిల్లీ, ఆగస్టు 19: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఏర్పాటైన విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు పెరిగాయి. కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత లేదన్న సంగతి బయటపడుతున్నది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్..వామపక్షాలతో ఉందా? తృణమూల్తో ఉందా? అన్నది తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికార తృణమూల్, బీజేపీ..రెండింటితోనూ తలపడతామని సీపీఎం ఇటీవలే ప్రకటించింది. బెంగళూరు మీటింగ్ తర్వాత రాహుల్గాంధీ, మమతా బెనర్జీ మధ్య మైత్రి పెరగటం వామపక్షాల్లో పలు అనుమానాల్ని రేకెత్తించాయి. అలాగే ఢిల్లీ, పంజాబ్ రాష్ర్టాల్లో బలంగా ఉన్న ఆప్తో జతకట్టడానికి కాంగ్రెస్ సుముఖంగా లేదు. కాంగ్రెస్తో ఆప్ చేతులు కలపటానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇష్టపడటం లేదు. కాంగ్రెస్ మద్దతు లేకుండా అన్ని లోక్సభ స్థానాల్లో ఆప్ విజయం సాధిస్తుందన్నారు. కేరళలో వామపక్షాల నేతృత్వంలోని ‘ఎల్డీఎఫ్’..కాంగ్రెస్ నేతృత్వంలోని ‘యుడీఎఫ్’ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నాయి.
ఛత్తీస్గఢ్లో కేజ్రీవాల్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. శనివారం రాయ్పూర్లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, ‘ఛత్తీస్గఢ్లో ప్రభుత్వ స్కూల్స్ అధ్వాన్నంగా ఉన్నాయి. ఢిల్లీలో స్కూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మీ బంధువులను అడగండి’ అంటూ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పాలనపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ‘రాయ్పూర్కు వచ్చి కేజ్రీవాల్ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఢిల్లీ పాలనపై చర్చకు సిద్ధమా’ అంటూ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆప్కు సవాల్ విసిరారు.