Ampareen Lyngdoh | అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేఘాలయలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలిది. మాజీ మంత్రి ఆంపరీన్ లింగ్డో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్లోని కాంగ్రెస్ అధికార హ్యాండిల్లో పోస్ట్ చేశారు. దీనిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, ప్రియాంకలకు ట్యాగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దిశ కోల్పోయిందని ఖర్గేకు రాసిన రాజీనామా లేఖలో విచారం వ్యక్తం చేశారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు కోల్పోయిందని ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆంపరీన్ లింగ్డో ఈస్ట్ షిల్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇటీవల పార్టీలో వస్తున్న పరిణామాలు తనను ఎంతగానో బాధించాలని ఆంపరీన్ లింగ్డో మీడియాకు చెప్పారు. పార్టీ దిశను కోల్పోయేలా ఇటీవలి పరిణమాలు తమను నమ్మేలా చేశాయని అన్నారు. మేఘాలయ ప్రజలతో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు కోల్పోయిందని ఆమె ఆరోపించారు. ఇక్కడి ప్రజలకు సేవ చేసేందుకు ఇదే నిజమైన వేదిక అని నమ్మానని, అయితే, ఇటీవలి పరిణామాలు పార్టీ దిశను కోల్పోయేలా చేశాయని చెప్పారు. తక్షణమే అమలులోకి వచ్చేలా తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆంపరీన్ లింగ్డో.. నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఎన్పీపీ, బీజేపీ, యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తున్నది. మొత్తం 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఆరు పార్టీల కూటమి ఎండీఏ ప్రభుత్వంలో ఎన్పీపీ ఆధిపత్యం ఉన్న పార్టీ. ఎండీఏ ప్రభుత్వంలో బీజేపీ, యూడీపీలు భాగస్వాములుగా ఉన్నాయి.