UP Polls : యూపీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కర్హల్ నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ తన అభ్యర్థిని ఈ సీటు నుంచి బరిలోకి దింపడం లేదు. మొదట తన అభ్యర్థిని ప్రకటించినా.. నామినేషన్ మాత్రం వేయలేదు. ఈ పరిణామం అఖిలేశ్కు బాగా కలిసొస్తుందని పలువురు పేర్కొంటున్నారు. కేవలం అఖిలేశ్ యాదవ్ విషయంలోనే కాదు.. ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ విషయంలోనూ కాంగ్రెస్ ఇలాగే చేసింది. జస్వంత్ నగర్ నుంచి శివపాల్ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ తన అభ్యర్థిని రంగంలోకి దింపడం లేదు. దీంతో ఈ ఇద్దరికీ లైన్ క్లియర్ అయినట్లేనని అందరూ భావిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపకూడదని తాము నిర్ణయించామని యూపీ కాంగ్రెస్ నేత రోహిత్ చౌదరి ప్రకటించారు. ఈ రెండు స్థానాల్లోనూ తాము సమాజ్వాదీకే మద్దతిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ప్రకటించిన మొదటి జాబితాలో కర్హల్ అభ్యర్థిని ప్రకటించింది. జ్ఞానవతీ యాదవ్ పేరును కాంగ్రెస్ తన జాబితాలో పేర్కొంది. అయితే సమాజ్వాదీ పార్టీయే ఇంకా ఈ స్థానం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపలేదు. ఈ స్థానం నుంచి అఖిలేశ్ను బరిలోకి దింపుతున్నామని ఆ పార్టీ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కర్హల్ అభ్యర్థి జ్ఞానవతీ సింగ్కు అధిష్ఠానం ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పిందని పార్టీ శ్రేణులు అంటున్నారు.