న్యూఢిల్లీ, మే 20 : తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారి ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి తొలనొప్పిగా మారింది. కేరళ నాయకత్వ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి 10 రోజులకు పైగా శ్రమించిన తర్వాత పార్టీ ఇప్పుడు కర్ణాటకలో కొత్త నాటకీయ పరిణామాలను ఎదుర్కుంటోంది. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(డీకే) మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 2026 ఎన్నికల సీజన్ ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్వయంగా ముఖ్యమంత్రి నుంచే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం డిమాండ్ పెరుగుతుండడంతో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు మళ్లీ తలెత్తాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టాన వర్గంతో సమావేశం కోరారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వారితో చర్చించాలనకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలంటూ డీకేపై ఒత్తిడి తీసుకువస్తున్న ఆయన మద్దతుదారులు రెండున్నరేండ్ల వాగ్దానంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరగాలని నాయకత్వానికి తెలియచేసినట్లు వర్గాలు చెప్పాయి.
2023లో రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే కర్ణాటక కాంగ్రెస్లో అధికార పోరాటం ప్రారంభమైంది. అధిష్టానంతో ఇద్దరు నాయకుల మధ్య 50:50 అధికార భాగస్వామ్య ఒప్పందం జరిగిందని డీకేకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. మధ్యమధ్యలో విరామాలు, తాత్కాలిక సంధి ఒప్పందాలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం ఏనాడూ పూర్తిగా ముగిసిపోలేదు. రాజకీయ సంకేతాలు, వర్గపోరు ఒత్తిడి వంటి వివిధ దశల ద్వారా ఈ పోరాటం పదేపదే మళ్లీ తలెత్తుతూనే ఉంది. ఏప్రిల్లో జరిగిన నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు కర్ణాటక కాంగ్రెస్లోని రెండు వర్గాల మధ్య తాత్కాలిక పోరు విరమణను తీసుకువచ్చాయి. ఎన్నికలు అయిపోయి ఫలితాలు కూడా వచ్చేసిన తర్వాత తన ఎన్నికల విధుల నుంచి కాంగ్రెస్ అధిష్టాన వర్గం బయటకు రావడంతో కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ చిచ్చు రగిలింది.
2025 చివరిలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వ తన పదవీకాలంలో సగానికి చేరుకుంటున్న తరుణంలో డీకే శివకుమార్ మద్దతుదారుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, విధేయులు పదేపదే ఢిల్లీని సందర్శించగా రెండున్నరేళ్ల ఫార్ములాకు సంబంధించిన వదంతులు ఊపందుకున్నాయి. అయితే తాను పూర్తి ఐదేండ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తానని, అధికార పంపకం ఒప్పందం ఏదీ లేదని సిద్ధరామయ్య నిలకడగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడవ సంవత్సరం పూర్తి చేసుకుంటుండగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తలు కలకలం రేపుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం అధికారాన్ని పటిష్టం చేసుకుని, అధికారంలో కొనసాగడానికి సిద్ధరామయ్య, ఆయన వర్గం అనుసరిస్తున్న వ్యూహమే ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. మరోవైపు, ఎలాంటి పెద్ద పునర్వ్యవస్థీకరణకైనా ముందే నాయకత్వ వారసత్వంపై స్పష్టత ఇవ్వాలని డీకే విధేయులు ఒత్తిడి చేస్తున్నారు. కాగా, కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోళి మంగళవారం నాయకత్వ సమస్యకు తెర పడుతుందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. త్వరలోనే ఢిల్లీ నుంచి తమకు పిలుపు వస్తుందని, సమస్యకు అక్కడే పరిష్కారం దొరుకుతుందని ఆయన చెప్పారు. మరో సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఎన్ రాజన్న స్పందిస్తూ ముఖ్యమంత్రి మార్పంటూ జరిగితే తదుపరి ముఖ్యమంత్రి హోం మంత్రి జీ పరమేశ్వర మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే రాజన్న వ్యాఖ్యలపై డీకే స్పందిస్తూ, ‘ముఖ్యమంత్రిని రాజన్న ఎందుకు మార్చాలనుకుంటున్నారు? సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవాలని రాజన్న ఉద్దేశమా?’అని డీకే ఎదురు ప్రశ్నించారు. ‘సీఎంను మార్చాలనుకుంటున్నది రాజన్ననే. ఆయన్నే అడగండి’ అని డీకే విలేకరులకు బదులిచ్చారు.