ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం కాంగ్రెస్తో అయ్యే పని కాదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్.. ప్రతిపక్ష పాత్రను పోషించడాన్ని జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ప్రజలే స్వయంగా బీజేపీని ఎత్తి పారేస్తారని, అప్పుడు ఎంచక్కా తాము అధికారంలోకి రావొచ్చన్న భ్రమలో ఉండిపోయిందని ఎద్దేవా చేశారు. ఎలాంటి పోరాటాలు, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే అధికారం దక్కుతుందన్న భ్రమల్లో కాంగ్రెస్ మునిగితేలుతోందని విమర్శించారు.
అసలు ప్రతిపక్షంలో ఎలా వుండాలి? ఎలా వ్యవహరించాలన్న విషయాలు కాంగ్రెస్ నేర్చుకోవాలని పీకే సూచించారు. మీడియా తమను పట్టించుకోవడం లేదన్న విషయం నుంచి బయటపడాలని, ప్రజలను తమను పట్టించుకోవం లేదన్న భావన నుంచి బయటపడాలని సూచించారు. కాంగ్రెస్ చాలా సంవత్సరాలుగా పతనాన్ని చవిచూస్తోందని పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ, బోఫోర్స్, మండల్ నిరసనలు, రామ మందిర ఉద్యమంతో పాటు 2014 లో అవినీతి వ్యతిరేక ఉద్యమం.. ఇలా వీటి కారణంగా కాంగ్రెస్ పెరుగుదల తగ్గిపోయిందని ఆయన వివరించారు. ఇలా పతనమవుతూ… తన ఓట్ బ్యాంకును కోల్పోతూ వస్తోందని ప్రశాంత్ కిశోర్ గుర్తు చేశారు.