Agnipath scheme : కేంద్ర ప్రభుత్వం సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. సైన్యంలో నాలుగేండ్ల సర్వీస్ అనంతరం రిటైరైన తర్వాత ఉద్యోగుల భవితవ్యంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జూన్లో కేంద్ర ప్రభుత్వం సైన్యంలో నియామకాల ప్రక్రియలో భాగంగా అగ్నిపథ్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా 17.5 ఏండ్ల నుంచి 21 ఏండ్ల వయసు వారిని నాలుగేండ్లు సైన్యంలో సేవలందించేందుకు సర్వీసులోకి తీసుకువెళతారు. అయితే నాలుగేండ్ల సర్వీస్ అనంతరం వారిలో 25 శాతం మంది 15 ఏండ్ల పాటు సర్వీస్లో కొనసాగనిస్తారు. ఇక నాలుగేండ్ల అనంతరం రిటైరయ్యే యువ ఉద్యోగుల భవిష్యత్కు ఎలాంటి హామీ లేదని, వారికి ఆ వయుసులో పెన్షన్ రాదని, గ్రాట్యుటీ రూ. 11 లక్షలను వారి వేతనం నుంచి తగ్గిస్తారని సచిన్ పైలట్ ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యయ నియంత్రణ చర్యల పేరుతో సాయుధ దళాల నియామక ప్రక్రియతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. యువతకు సైన్యంలో జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాష్ట్రపతికి లేఖ ద్వారా తెలయచేశారని సమాచారం అందచేశారు. ప్రపంచంలోనే మన సైన్యం, రక్షణ బలగాల పాటవం, స్వయం కృషి మరపురానివని లేఖలో వివరించారని సచిన్ పైలట్ పేర్కొన్నారు.