న్యూఢిల్లీ : ఆరెస్సెస్ను దేశ విద్రోహ సంస్ధగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించగా బీజేపీ, కాంగ్రెస్ల మధ్య డైలాగ్ వార్ ముదిరింది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు లక్షలాది మంది తమ జీవితాలను త్యగం చేయగా ఓ జాతి వ్యతిరేక సంస్ధ త్రివర్ణ పతాకాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నడూ విముఖత చూపేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 52 ఏండ్ల పాటు నాగపూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయలేదని, ఇప్పటికీ ఆరెస్సెస్ అదే తీరున ఉందని కర్నాటకలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాహుల్ దుయ్యబట్టారు.
ఖాదీతో జాతీయ పతాకాన్ని రూపొందించే వారి జీవనోపాధిని ఎందుకు దెబ్బతీశారని, యంత్రాలపై రూపొందే చైనా తయారీ పాలిస్టర్ జెండాలకు ఎందుకు అనుమతించారని నిలదీశారు. ఆరెస్సెస్పై రాహుల్ ట్వీట్ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తప్పుపట్టారు. ఆరెస్సెస్ సిద్ధాంతాన్ని దేశ ప్రజలు ఆమోదించడంతోనే తాము రెండు సీట్ల నుంచి పాలనా పగ్గాలు చేపట్టే స్ధాయికి ఎదిగామని చెప్పుకొచ్చారు.
ఇక ఆరెస్సెస్, బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే దీటుగా బదులిచ్చారు. మన జాతీయ పతాకానికి గౌరవం ఇవ్వాలని ఆరెస్సెస్ ఎన్నడూ కోరుకోలేదని దుయ్యబట్టారు. ఆరెస్సెస్ చరిత్ర తెలిసిన వారెవరూ ఆరెస్సెస్ త్రివర్ణ పతాకాన్ని అవమానపరచడం పట్ల ఆశ్చర్యపడరని అన్నారు. వాట్సప్ యూనివర్సిటీ నుంచి బయటపడి ఈ నకిలీ భక్తుల చరిత్ర చదివితే తాను చెప్పింది నిజమని మీకు తెలుస్తుందని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు.