న్యూఢిల్లీ : 2022-23 సంవత్సరానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను కేంద్రం 4-9 శాతం పెంచడంపై కాంగ్రెస్ పెదవివిరిచింది. ఇది నామమాత్రపు పెంపని, మోతెక్కుతున్న ద్రవ్యోల్బణంతో ఇది ఏమాత్రం సరిపోదని అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల రాబడిని పెంచేందుకు బదులు మోదీ ప్రభుత్వం రైతుల కష్టాలను వందరెట్లు పెంచిందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా గురువారం ఆరోపించారు.
మోదీ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని మరోసారి మోసగించిందని, ఎంఎస్పీని అరకొరగా పెంచిందని దుయ్యబట్టారు. మోదీ హయాంలో రైతుల ఆదాయం పెరగకపోగా వారి కష్టాలు వంద రెట్లు పెరిగాయని ఆక్షేపించారు. ఖరీఫ్ సీజన్లో వివిధ పంటలకు పెరిగిన ఎంఎస్పీల జాబితాను ట్విట్టర్లో షేర్ చేసిన సుర్జీవాలా ధరల పెరుగుదలతో పోలిస్తే ఇది ఎంతమాత్రం సరిపోదని స్పష్టం చేశారు.
ద్రవ్యోల్బణ రేటు 6.7 శాతానికి పెరుగుతుందని ఆర్బీఐ ఇటీవల అంచనా వేయగా ఎంఎస్పీ రేట్లు ద్రవ్యోల్బణ రేటు కంటే అతితక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యానికి క్వింటాల్కు రూ 100 చొప్పున పెంచి రూ 2040గా ఎంఎస్పీని కేంద్రం బుధవారం నిర్ణయించింది.