సూరత్: కాంగ్రెస్ పార్టీయే తనకు మోసం చేసిందని ఆ పార్టీ సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ (Nilesh Kumbhani) చెప్పారు. తాను పార్టీకి ధోఖా చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు చెయ్యిచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరత్లో ఏప్రిల్ 21న నామినేషన్ తిరస్కరణకు గురయిన తర్వాత కనిపించకుండా పోయిన ఆయన.. ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామ్రాజ్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ కేటాయించిందని, అయితే చివరి క్షణంలో తనకు బదులు మరొకరిని బరిలో నిలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా తొలుత కాంగ్రెస్ పార్టీయే తనను మోసం చేసిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్కోట్ లోక్సభ అభ్యర్థి పరేశ్ ధనానిపై గౌరవంతోనే తాను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నాని చెప్పారు.
సూరత్లో ఐదుగురు స్వయంప్రకటిత నాయకులు పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. వారు పనిచేయరని, మరొకరు పనిచేయడానికి ఒప్పుకోరని విమర్శించారు. దీంతో తన మద్దతుదారులు, కార్యకర్తలు నిరాశ చెందారని వెల్లడించారు. కూటమి భాగస్వామి అయిన ఆప్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించినా అడ్డుకునేవారని చెప్పారు. కాగా, నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రం తిరస్కరణకు గురవడంతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచింది. ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో గత నెల 21 నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే సుమారు 20 రోజుల తర్వాత ఆయన బాహ్యప్రపంచంలోకి వచ్చారు.