న్యూఢిల్లీ : దేశీయంగా తయారైన తొలి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌక నౌకా దళంలోకి చేరిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. 1999 నుంచి పలు ప్రభుత్వాల సమిష్టి ప్రయత్నాలతోనే ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి తీసుకురాగలిగామని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రశ్నించారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్ఎస్ విక్రాంత్ నేడు నౌకా దళంలోకి ప్రవేశించడం 1999 నుంచి పలు ప్రభుత్వాలు సాగించిన సమిష్టి కృషికి ఫలితం కాదా అని ఆయన ప్రధాని మోదీని నిలదీశారు. 1971 యుద్ధంలో భారత్కు ఎంతో ఉపయోగపడిన అసలైన ఐఎన్ఎస్ విక్రాంత్ను కూడా గుర్తుచేసుకోవాలని అన్నారు. బ్రిటన్ నుంచి దానిని తీసుకురావడంలో కృష్ణ మీనన్ కీలక పాత్ర పోషించారని జైరాం రమేష్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. కాగా దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ శుక్రవారం భారతీయ నౌకాదళంలోకి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ యుద్ధ నౌకను జలప్రవేశం చేయించారు.
భారతీయ నౌకాదళ చరిత్రలో గతంలో ఇంత పెద్ద యుద్ధ నౌకను స్వదేశీయంగా తయారు చేయలేదు. కొచ్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతరులు పాల్గొన్నారు. యుద్ధ విమానాలను మోసుకెళ్లే ఐఎన్ఎస్ విక్రాంత్ను నౌకాదళంలోకి చేర్చుతున్న సందర్భంగా కొచ్చిన్ షిప్యార్డులో గ్రాండ్ సెర్మనీ నిర్వహించారు.45వేల టన్నుల యుద్ధ విమానాన్ని సుమారు 20 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు.