న్యూఢిల్లీ, మే 14: కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ, ఊహాగానాలకు తెరపడింది. ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సతీశన్ ఎంపికను ఏఐసీసీ కేరళ ఇన్చార్జ్ దీపా దాస్మున్షీ, రాష్ట్రం కోసం పార్టీ నియమించిన కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సతీశన్ ఈ నెల 18న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితల పోటీపడ్డారు. ఈ సందర్భంగా సతీశన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంలో ఏఐసీసీ యత్నాలను సమన్వయం చేసి పార్టీ కార్యకలాపాలన్నింటికీ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రచార కమిటీ చైర్మన్గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయంలో పోషించిన పాత్రను ప్రస్తుతిస్తూ ఆయన నా నాయకుడు కూడా అని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని సాధించడంలో సహాయపడిన లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలకు, యూడీఎఫ్ సంకీర్ణ భాగస్వాములకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నాయకుడిని సీఎంగా ప్రకటించకపోవడంపై కేసీ వేణుగోపాల్ వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దాదాపు 40 నిమిషాలపాటు సమావేశమైన మరుసటి రోజు కేరళ ముఖ్యమంత్రి ప్రకటన వెలువడింది. పార్టీ అధిష్టాన వర్గం చర్చలు పూర్తి చేసినట్లు బుధవారం కాంగ్రెస్ ప్రకటించింది. మే 4న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 140 స్థానాలకు గాను 102 స్థానాలను కైవసం చేసుకున్నప్పటి నుంచి కేరళ తదుపరి ముఖ్యమంత్రిపై నిర్ణయం పెండింగ్లో ఉంది. పార్టీ పరిశీలకులు మాకెన్, వాస్నిక్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలసి వారి అభిప్రాయాలను సేకరించిన తర్వాత కూడా రోజుల తరబడి అనిశ్చితి కొనసాగడంతో పార్టీ కేంద్ర నాయకత్వం విస్తృత సంప్రదింపులు జరిపింది.
పార్టీ నాయకత్వం ఆ పదవికి పోటీపడుతున్న ముగ్గురు ప్రధాన అభ్యర్థులతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్తో కూడా చర్చలు జరిపింది. సతీశన్, వేణుగోపాల్, చెన్నితలకు మద్దతు ఇచ్చే వర్గాల మధ్య అంతర్గత పోటీ కారణంగా కేరళలో కాంగ్రెస్ విజయం మరుగున పడింది. ముఖ్యమంత్రి పేరును ప్రకటించడంలో జరుగుతున్న జాప్యం పార్టీ కార్యకర్తలతోపాటు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలలో కూడా ఆందోళన రేకెత్తించింది.