న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం ఢిల్లీలోకి ప్రవేశించింది. జడ్ప్లస్ సెక్యూరిటీ కలిగిన రాహుల్ చుట్టూ భద్రతా వలయాన్ని నిర్వహించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యాయరని కాంగ్రెస ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, జోడో యాత్రికులు రాహుల్ చుట్టూ భద్రతా వలయంగా ఏర్పాటవగా ఢిల్లీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటన్న వారిని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటరాగేట్ చేస్తూ వేధింపులకు గురిచేస్తోందని, ప్రముఖులను పాదయాత్రలో పాల్గొనకుండా నిరోధిస్తోందని వెల్లడించారు.
దేశంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలనే ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర సాగుతోందని, ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడకుండా కాంగ్రెస్ నేతలకు భద్రత కల్పించాలని కోరారు. హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్కు చెందిన కొందరు దుండగులు ఆ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర కంటెయినర్లలో ప్రవేశించారని, డిసెంబర్ 23న తాము హర్యానాలోని సొహ్న పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద భారత భూభూగంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందని కేంద్ర హోం మంత్రికి రాసిన లేఖలో కాంగ్రెస్ పేర్కొంది.