Karnataka Elections | బెంగళూరు, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్లు లభించక అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడానికి కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 24 మందికి ఈసారి టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారిలో చాలా మంది ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రచారానికి దూరంగా ఉన్న వారిలో కనీసం రెండు వందల మంది పార్టీ సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్ కార్యకర్తలకు అధిష్ఠానం ప్రతినిధులు ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. మరి కొందరు అసంతృప్తి నేతలకు రాష్ర్ట స్థాయి నాయకులు తాయిలాల ఆశ చూపిస్తున్నారు. శుక్రవారం దాదాపు 60 మంది నాయకులతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమై ప్రచారంలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. మరోవైపు అవినీతి మరకలంటిన ఈశ్వరప్పకు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించటం చూస్తే అవినీతి విషయంలో మోదీ రాజీపడినట్టేనని విపక్షాలు దాడికి దిగుతున్నాయి. ఇంకో వైపు గజేంద్రగడ్ బీజేపీ అభ్యర్థి కళకప్ప బండి తమ్ముడు, బీజేపీ ప్రముఖుడు సిద్ధప్ప బండి, చిత్తాపూర్ బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విశ్వనాథ్ పాటిల్ హెబ్బాళ్, అరవింద చౌహాన్ తమ అనుచర గణంతో శనివారం కాంగ్రెస్లో చేరారు.
మార్చి 29 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా, ఇప్పటివరకూ రూ.250 కోట్లకుపైగా నగదు, ఇతర వస్తువులను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సీజ్ చేశాయి. ఈమేరకు ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రూ.82 కోట్లు నగదు, రూ.57 కోట్ల విలువైన మద్యం, రూ.78 కోట్ల బంగారం, వెండి ఆభరణాలు, ఓటర్లను ప్రభావితం చేసే రూ.20 కోట్ల ఉచిత పంపిణీ సరుకులు, రూ.17 కోట్ల మాదక ద్రవ్యాలున్నాయని తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,130 మంది అభ్యర్థుల నామినేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ వేసింది. ఇందులో 239 నామినేషన్లు మహిళలవి. బీజేపీ అన్ని స్థానాల్లో తన అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 223 స్థానాల్లో, జేడీ(ఎస్) 211 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 212 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపింది.
బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి మైనింగ్ కేసులో బళ్లారికి వెళ్లకుండా కోర్టు ఆంక్షలు విధించింది. దీంతో గంగావతి నుంచి ఆయన పోటీ చేశారు. వీడియో సందేశాలు, ఫోన్ కాల్స్తో ఓటర్లను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కలబురగి, బీదర్ జిల్లాల్లో తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడు పార్టీలు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.