రాంచీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతి తెలివి ప్రదర్శించింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను బురిడీకొట్టించేందుకు సమావేశం పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేసింది. దీంతో పెద్ద సంఖ్యలో వచ్చిన ఈడీ (ED) అధికారులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అయితే ఈడీ బ్యానర్లలో పేర్కొన్నట్లుగా ఆ రోజుల్లో ఎలాంటి సమావేశాలు జరుగలేదు. విస్తూపోయే ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో ఇటీవల పలు చోట్ల ఈడీ సమావేశం పేరుతో బ్యానర్లు వెలిశాయి. ‘మనీలాండరింగ్ దుష్ఫలితాలు, దానిని పరిష్కరించే మార్గాలపై’ ఈ నెల 13,14న సదస్సు నిర్వహిస్తున్నట్లు రాంచీలోని ఈడీ విభాగం అందులో పేర్కొంది. ఈడీ ప్రతినిధులు, వక్తలు, అతిథులను ఈ సమావేశానికి స్వాగతం పలికింది.
వాస్తవానికి ఈ నెల 13, 14న రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఎలాంటి సదస్సులు జరుగలేదని తెలిసింది. రైడ్ల కోసం వచ్చే ఈడీ అధికారులను పసిగట్టే ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు ఆ దర్యాప్తు సంస్థ ఇలా ప్లాన్ చేసింది. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్ర దర్యాప్తులను ఉసిగొల్పుతున్నట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు వచ్చే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెడుతున్నారు. వారి రాకను పసిగట్టి స్థానిక ప్రభుత్వాలను అలెర్ట్ చేస్తున్నారు.
కాగా, జార్ఖండ్లో కూడా గతంలో ఇలాగే జరిగింది. కోల్ స్కామ్పై దర్యాప్తు కోసం వచ్చిన ఈడీ అధికారులపై రాష్ట్ర ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు ఒక కన్నేసి ఉంచేవారు. ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి వారి కదలికలను పసిగట్టేవారు. రైడ్ చేసే అనుమానితులను అలెర్ట్ చేసేవారు. తద్వారా కేంద్ర సంస్థల దర్యాప్తును భగ్నం చేసేవారు.
మరోవైపు జార్ఖండ్లో ఇలాంటి అనుభవాలను చవిచూసిన ఈడీ ఈసారి భిన్నంగా వ్యవహరించింది. భూకబ్జా కేసులో సోదాలు చేసేందుకు ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్, పోలీస్ విభాగాలను బురిడీకొట్టేందుకు ప్లాన్ వేసింది. రాంచీలో ఈ నెల 13, 14 తేదీల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు బ్యానర్లు ఏర్పాటు చేసింది. స్థానిక మీడియాను కూడా ఇలాగే తప్పుదారి పట్టించింది.
ఈ సమావేశానికి హాజరు పేరుతో 70 మందికిపైగా ఈడీ అధికారులు ఢిల్లీ, ముంబై, కోల్కతా నుంచి రాంచీకి చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తమ తమ గుర్తింపుతోనే పలు హోటళ్లలో బస చేశారు. ఆ సమావేశం రోజుల్లో భూకబ్జా కేసులో ఆరోపణలున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏక కాలంలో రైడ్లు నిర్వహించారు. కోట్లలో డబ్బుతోపాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ రైడ్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు అధికారులు షాక్ అయ్యారు.