న్యూఢిల్లీ: వాస్తవాధీన నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ప్రాంతంలో వివాదాస్పద అక్సాయ్ చిన్ మీదుగా రైలు మార్గం నిర్మించాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. దీని పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే ఎల్ఏసీ వెంబడి డ్రాగన్ దేశం నిర్వహిస్తున్న కార్యక్రమాలపై టిబెట్, భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానికి తోడు ఎల్ఏసీ వెంబడి ఆర్మీ ట్రూప్ల మోహరింపు స్వల్పంగా పెరిగిందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గత నెలలోనే ప్రకటించారు. కాగా, 38 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా 1950లో ఆక్రమించుకొన్నది.
1962లో జరిగిన భారత్-చైనా యుద్ధంలో ఈ ప్రాంతాన్ని ఆ దేశ మిలటరీ పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకొన్నది. అయితే, ఇప్పుడు నిర్మించాలనుకున్న కొత్త రైలు మార్గం చైనా, భారత్, నేపాల్ సరిహద్దుల మీదుగా సాగుతుందని ‘రైల్వే టెక్నాలజీ’ తన రిపోర్టులో వెల్లడించింది. దీని డిజైన్ ప్రకారం రైలు మార్గం షీగేట్స్ నుంచి ప్రారంభమై టిబెట్, ఈశాన్య ప్రాంతాల మీదుగా నేపాల్ బోర్డర్, అక్సాయ్ చిన్ మీదుగా వచ్చి హోటన్, జిన్జియాంగ్లో ముగుస్తుంది. అయితే చైనాలోని ఎల్ఏసీలో ఇది రుటోగ్, పాంగాంగ్ లేక్ మీదుగా సాగుతుంది.