న్యూఢిల్లీ, జూన్ 27: దేశంలో సైబర్క్రైమ్ నేరాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 2020 నుంచి 2023 మే 15 వరకు ఏకంగా 22,57,808 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు. కానీ వాటిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో రాష్ర్టాలు విఫలమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా ఫిర్యాదులు రాగా, వాటిలో 43,022 కేసులే ఎఫ్ఐఆర్కు నోచుకున్నాయి. ఇది మొత్తం కేసుల్లో 1.9 శాతమే కావడం శోచనీయం. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త జితేంద్ర గడ్గే సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. వివిధ రాష్ర్టాలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో అలసత్వం వహిస్తున్నాయి. దేశంలోని చాలా రాష్ర్టాల్లో 2 శాతం కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకపోగా, తెలంగాణ పోలీసులు తమకు అందిన మొత్తం ఫిర్యాదుల్లో 17 శాతం ఎఫ్ఐఆర్లు నమోదు చేసి రాష్ర్టాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు. బాధితులకు న్యాయం చేయడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారు.
సైబర్క్రైమ్ నేరాలపై ఫిర్యాదులకు గానూ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను 2020లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తీసుకొచ్చింది. ఈ పోర్టల్ వేదికగా ఆన్లైన్లో ఫిర్యాదులు చేయవచ్చు. ఇది పోలీసులకు ఫిర్యాదుదారులకు మధ్య అనుసంధానకర్తగా ఉంటుంది. ఆన్లైన్ చైల్డ్ ఫోర్నోగ్రఫీ, పిల్లలపై లైంగిక వేధింపులు, లైంగికదాడులు, సామూహిక లైంగికదాడి, సోషల్మీడియా నేరాలు, ఆన్లైన్లో జరిగే ఆర్థిక మోసాలు, క్రిప్టో కరెన్సీ మోసాలు తదితర సైబర్ నేరాలపై ఫిర్యాదులు చేసేందుకు ఈ పోర్టల్ను ఆశ్రయించవచ్చు.
దేశవ్యాప్తంగా లైంగికదాడులపై 1,58,190 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 0.09 శాతం అనగా 154 ఎఫ్ఐఆర్లే నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతున్నది. వీటిలో అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 67,082 మంది ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత తమిళనాడు (12,785), మహారాష్ట్ర (10,878) నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. వరుసగా ఈ రాష్ర్టాలు 13, 3, 9 ఎఫ్ఐఆర్లే నమోదు చేయడం గమనార్హం. ఇతర సైబర్ నేరాలపై 20,99,618 మంది ఫిర్యాదులు చేయగా, 42,868 ఎఫ్ఐఆర్లే నమోదయ్యాయి. ఇది మొత్తం కేసుల్లో 2 శాతమే. ఉత్తరప్రదేశ్ (3,84,942), ఢిల్లీ (2,16,739), మహారాష్ట్ర (1,95,409) వరుసగా అత్యధిక ఫిర్యాదులతో మొదటి వరుసలో నిలిచాయి.