బెంగళూరు: ప్రధాని మోదీ వారం కిందట కొత్తగా ప్రారంభించిన హైవే నీట మునిగింది. దీంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 12న బెంగళూరు-మైసూరు హైవేను ప్రధాని మోదీ ప్రారంభించారు.118 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని రూ. 8,480 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ హైవే అందుబాటులోకి రావడంతో బెంగళూరు నుంచి మైసూరుకు ప్రయాణ సమయం మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గుతుందని ప్రారంభం సందర్భంగా మోదీ తెలిపారు.
కాగా, శుక్రవారం రాత్రి బెంగళూరులోని రామనగర ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొత్తగా ప్రారంభించిన బెంగళూరు-మైసూరు హైవే నీట మునిగింది. రహదారిలోని అండర్ బ్రిడ్జీ వద్ద భారీగా వర్షం నీరు నిలిచింది. దీంతో పలు వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి. హైవేపై వాహనాల కదలికలు నెమ్మదించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. గత ఏడాది కూడా భారీ వర్షాలకు ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి ఉంది.
మరోవైపు కొత్తగా ప్రారంభించిన హైవే వల్ల ఈ కష్టాలు తీరుతాయని వాహనదారులు భావించారు. అయితే వర్షాలకు అండర్ బ్రిడ్జీ వద్ద భారీగా వర్షం నీరు నిలిచిపోయింది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారు నీట మునిగి ఆగిపోయిందని, వెనుక వస్తున్న లారీ తన కారును ఢీకొట్టిందని వికాస్ అనే వ్యక్తి విమర్శించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ రహదారి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందో లేదో అని ప్రారంభించిన ప్రధాని మోదీ, రవాణా మంత్రిత్వ శాఖతో తనిఖీ చేయించారా? అని నిలదీశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మేం బాధపడాలా? అని దుయ్యబట్టారు. భారీగా టోల్ రుసుము వసూలు చేస్తున్నారని, రహదారి ఇలా ఉంటే దాని వల్ల ఉపయోగం ఏమిటి? అని వికాస్ ప్రశ్నించారు. సీఎం బొమ్మై తన కారును రిపేర్ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, తన వాహనం కూడా ప్రమాదానికి గురైందని నాగరాజు అనే వ్యక్తి వాపోయారు. అండర్ బ్రిడ్జీ వద్ద భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వరుసగా ఎనిమిది కార్లు ఢీకొన్నాయని విమర్శించారు. బ్రిడ్జీ వద్ద నిలిచిన వర్షం నీరు బయటకు పోయే మార్గం కూడా లేదన్నారు. ఒకవేళ ప్రధాని మోదీ వస్తున్నారని తెలిస్తే పది నిమిషాల్లో అక్కడి నీటిని బయటకు పంపింగ్ చేసే చర్యలు చేపడతారని, అలాంటిది సాధరణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టదా? అని నిలదీశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు అండర్ బ్రిడ్జీ వద్ద వాహనదారులు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించిన వీడియో క్లిప్లు, దీనిపై విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"Did PM Even Check…": Commuters Enraged As Newly-Opened Highway Floods https://t.co/xkc1DzzjWn pic.twitter.com/0dITK2G0Wn
— NDTV (@ndtv) March 18, 2023