Maharashtra | కొల్హాపూర్, జూన్ 8: గత మూడు నెలల్లో మహారాష్ట్రలోని 8 నగరాల్లో తరచూ మత ఉద్రికత్తలు, హింస చోటు చేసుకున్నాయి. శంభాజీ నగర్, అకోలా, షిగావ్, శెంగమ్నర్, జలగావ్, ముంబై, కోల్హాపూర్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవి చోటు చేసుకుంటున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల కొల్హాపూర్లో చెలరేగిన ఉద్రికత్తల విషయమై పోలీసులకు, ప్రభుత్వానికి ముందస్తు సమాచారమున్నా వాటిని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్కు చెందిన ప్రతిపక్ష నాయకుడొకరు ఆరోపించారు. ప్రజలు భారీగా గూమికూడకుండా నిరోధించడంలో పోలీసులు విఫలం కావడాన్ని ఇంటెలిజెన్స్ వైఫల్యంగా ఆయన అభివర్ణించారు. ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా మార్చిన తర్వాతే ఈ తరహా మత ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయని స్వయంగా పోలీసు వర్గాలే వెల్లడించాయి. ముంబైలోని మాల్వాణి ప్రాంతంలో, ఛత్రపతి శంభాజీ నగర్లో శ్రీరామనవమి సందర్భంగా హింస జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం కొల్హాపూర్లో సాధారణ పరిస్థితి నెలకొంది. అయితే హిందూ సంఘాలు కొల్హాపూర్ బంద్కు, ర్యాలీకి పిలుపు ఇచ్చినప్పుడు పోలీసులు జన సమూహాన్ని ఎందుకు నిరోధించలేకపోయారు? టియర్ గ్యాస్ ప్రయోగించే స్థాయికి పరిస్థితి ఎందుకు చేజారిపోయింది? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి 36 మందిని అరెస్ట్ చేశారు.
మార్చి 31, 2023 – శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా రాళ్ల దాడి. పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి. పోలీసులు అరెస్ట్ చేసిన 76 మందిలో 9 మంది మైనర్లు.
మే 13, 2023 – సోషల్ మీడియా పోస్ట్ వల్ల అకోలాలో మత హింస. ఒకరి మృతి, 10 మందికి గాయాలు. వంద మంది అరెస్ట్.
మే 14, 2023 –షిగావ్ (అహ్మద్నగర్)లో ఛత్రపతి శంభాజీ మహరాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మత ఉద్రిక్తతలు. 150 మందిపై కేసు నమోదు, 30 మంది అరెస్ట్.
మే 14, 2023 – త్రయంబకేశ్వర్లో మత ఉద్రిక్తతలు. నలుగురి అరెస్ట్. విచారణ కోసం సిట్ ఏర్పాటు.
జూన్ 6, 2023 – లవ్ జిహాద్కు వ్యతిరేకంగా శెంగమ్నర్లో ర్యాలీ. సమనాపూర్ గ్రామంలో రాళ్ల దాడి.
జూన్ 7, 2023 – మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తించిన పోస్టింగ్పై కొల్హాపూర్లో హింసాత్మక ఘటనలు.
కర్ణాటక ఎన్నికల్లో ఎత్తుకున్న బజరంగ బలీ నినాదం కలిసి రాకపోవడంతో ఇప్పుడు కమలనాథులు ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్లను పట్టుకుని పాకులాడుతున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ విమర్శించారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో మత హింస చెలరేగడానికి అధికార పార్టీ భాగస్వామి అయిన బీజేపీయే కారణమని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయాలు చేయడానికి బీజేపీకి ఔరంగజేబు చాలా అవసరమని ఆయన విమర్శించారు. కాగా, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ను ఔరంగజేబ్ అంటూ మాజీ ఎంపీ, బీజేపీ నేత నీలేష్ రాణే వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ శుక్రవారం జైల్భరోకు పిలుపునిచ్చింది. ఎన్సీపీ అధికార ప్రతినిధి తపాసె మాట్లాడుతూ రాణే వెంటనే తన ట్వీట్ను తొలగించాలని, బీజేపీ, రాణే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పుణె, జూన్ 8: మొఘల్ రాజు ఔరంగజేబు, మైసూరు రాజు టిప్పు సుల్తాన్ పేరుతో కొల్హాపూర్, రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో హింస ప్రజ్వరిల్లడాన్ని ఎన్సీపీ నేత శరద్ పవార్ గురువారం తీవ్రంగా ఖండించారు. ఇది మహారాష్ట్ర సంస్కృతి ఎంతమాత్రం కాదని అన్నారు. 18వ శతాబ్దపు పాలకుడైన టిప్పు సుల్తాన్, మొఘల్ రాజు ఔరంగజేబులను ప్రస్తుతిస్తూ పెట్టిన వాట్సాప్ స్టేటస్ వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా పవార్ బారామతిలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘అల్లర్లు జరిగిన ప్రాంతం, రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల ప్రజలు శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అల్లర్లు, హింస మన సంస్కృతి ఎంతమాత్రం కాదు. శాంతం, ప్రేమకు చిహ్నమైన మహారాష్ట్రలో ఒకటి రెండు చోట్ల ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ప్రజలు ఎలాంటి ఉద్రిక్తతలకు లోనై అల్లర్లకు పాల్పడవద్దు, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దంటూ’ విజ్ఞప్తి చేశారు. ఎవరో కొందరు స్వార్థపరులు చేస్తున్న ఈ హింసకు సామాన్యులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.