న్యూఢిల్లీ, డిసెంబర్ 8: న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ ఈ దేశంలో అమలులో ఉన్న ఒక చట్టమని, దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తాము చట్టంగా ప్రకటించిన దానికి అందరూ లోబడి ఉండాల్సిందేనని, కొలీజియం వ్యవస్థను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకంపై కొలిజీయం సిఫారసు చేసిన పేర్లకు ఆమోదం తెలపడంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న సంగతి తెలిసిందే. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ యాక్ట్(ఎన్జాక్)ను సుప్రీంకోర్టు రద్దు చేయటంపై కేంద్ర మంత్రి కిరన్ రిజిజు, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధనకర్ ఇటీవల ఒక సభలో ఆ తరువాత బుధవారం నాడు పార్లమెంట్లో సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు గురువారం చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ప్రభుత్వ అధినేతలు సుప్రీంకోర్టు కొలీజియంపై చేసిన వ్యాఖ్యలను సహించబోం. ఈ విషయమై ప్రభుత్వానికి తగిన సూచన చేయండి’ అని జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిని ఆదేశించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన న్యాయసూత్రాలను అనుసరించాలని ప్రభుత్వానికి అటార్నీ జనరల్ సూచిస్తారని ఆశిస్తున్నట్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుంది?
కొలీజియం సిఫారసు చేసిన 19 పేర్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కి పంపిందని ధర్మాసనం తెలిపింది. ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుందని ప్రశ్నించింది. ‘కొలీజియం వ్యవస్థ ఉన్నంత వరకు మేము దానిని అమలు చేయాల్సిందే. మీరు మరో చట్టాన్ని తీసుకొని రావాలనుకుంటే.. ఎవరూ మిమ్మల్ని ఆపడం లేదు’ అని స్పష్టం చేసింది. ఏ చట్టాన్ని అమలు చేయాలో.. ఏ చట్టాన్ని అమలు చేయకూడదో సమాజంలోని ఒక వర్గం నిర్ణయించడం మొదలుపెడితే వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని వ్యాఖ్యానించింది. ‘మీరు ఒక చట్టాన్ని నిర్దేశించిన తరువాత.. అది రద్దయితే తప్ప.. కోర్టులు దానిని అమలు చేస్తూనే ఉంటాయి’ అని ధర్మాసనం వివరించింది. ‘చివరగా మేమొక్కటి మాత్రం చెప్పగలం.
చట్టం అమలుకు యోగ్యమైనదా? కాదా? అని నిర్ణయించేందుకు రాజ్యాంగం కోర్టును అంతిమ మధ్యవర్తిగా నిర్దేశించింది. చట్టాన్ని రూపొందించి, ఆమోదించే అధికారం పార్లమెంట్దే. అయితే ఆ చట్టం లోటుపాట్లను పరిశీలించే అధికారం కోర్టులకు ఇవ్వబడింది’ అని ధర్మాసనం పునరుద్ఘాటించింది. నిర్దేశించిన చట్టం ఏదైనా సరే ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ‘ఈ న్యాయస్థానం ప్రకటించిన ఏ చట్టానికైనా ప్రతి ఒక్కరు లోబడాల్సిందే. ఈ ఒక్క సంకేతాన్ని నేను ఇవ్వదలచుకున్నాను’ అని జస్టిస్ కౌల్ స్పష్టం చేశారు.
కొలీజియం సిఫారసు చేసిన పేర్లు కొన్ని నెలలు, సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, కొన్ని పేర్లను కొలీజియం పునరుద్ఘాటించినప్పటికీ ఆమోదం తెలపలేదని, ఇది కోర్టును వేదనకు గురిచేసిందని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు కొలీజియం పంపే పేర్లకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలుపుతుందంటే.. సీనియారిటీ సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతనే ఆ నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని మరోమారు స్పష్టంచేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది.