Cold wave | ఉత్తరాది రాష్ట్రాలను చలి గాలులు వణికిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ సహా ఉత్తర ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, బిహార్ తదితర 11 రాష్ట్రాలను చలిగాలుల పట్టిపీడిస్తున్నాయి.
శ్రీనగర్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 5కి చేరుకున్నది. పహల్గావ్లో మైనస్ 6.4 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వ్యక్తులు, వాహనాలు కనిపించక ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు బిహార్లో అకాల వర్షాలకు ఇద్దరు చనిపోయారు. భాగల్పూర్లో ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. చలిగాలుల దృష్ట్యా, బిహార్లోని పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేశారు. మరోవైపు హర్యానాలోనూ ఉష్ణోగ్రతలు 5.8 డిగ్రీలకు చేరుకున్నాయి.
వాతావరణ శాఖ ప్రకారం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, త్రిపురలో ఇవాల్టి నుంచి వారం రోజుల పాటు రాత్రి, ఉదయం దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉన్నది. ఈ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు, వర్షం కురిసే అవకాశం ఉన్నది. డిసెంబరు 26న ఢిల్లీలో ఉష్ణోగ్రత 4 డిగ్రీల వరకు పడిపోవచ్చు. ఢిల్లీలో ఉదయం 11 గంటలు దాటినా రోడ్లపై వాహనాలు, ప్రజలు కనిపించకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి.
బిహార్లో చలి తీవ్రతకు ఇద్దరు మృతిచెందారు. మరోవైపు శనివారం సాయంత్రం పాట్నా సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షం వల్ల చలి మరింత పెరిగింది. పాట్నాతో పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పొగమంచు కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పాట్నాలో విజిబిలిటీ 100 మీటర్లకు తగ్గింది. రానున్న రోజుల్లో వర్షాలు, చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.