North Cold wave | ఉత్తర భారతదేశంలో కోల్డ్ వేవ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో పాటు 5 రాష్ట్రాల్లో చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారి ఐదు గంటలైనా మంచు వీడకపోవడంతో రోడ్లపై వాహనాలు నడపడం కష్టంగా మారింది. చలిగాలుల తీవ్రత కారణంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మంచుకు వాన తోడైంది. మరో రెండు, మూడు రోజులు వడగళ్ల వాన కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హిమాచల్ ప్రదేశ్లో మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో రహదారులు మూసుకుపోయాయి. రానున్న 48 గంటల్లో మధ్యప్రదేశ్లో వానలు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా, ఢిల్లీలో సోమవారం ఉష్ణోగ్రత 7.6 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. దట్టమైన పొగమంచు ట్రాఫిక్పై తీవ్ర ప్రభావం చూపుతున్నది. నిర్మాణ పనులు నిలిపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఇక్కడి పలు ప్రాంతాల్లో మైనస్ 5 వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో సోమవారం అత్యల్ప ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కాగా, ఫతేపూర్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించడం కష్టంగా ఉంటుందని హెచ్చిరించింది. ఢిల్లీలో సోమవారం గాలి నాణ్యత 357గా నమోదైంది. రానున్న కొద్ది రోజుల్లో ఇక్కడి గాలి నాణ్యత మరింతగా క్షీణించే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కప్పబడిపోయాయి. భోపాల్కు వచ్చే ఎయిరిండియా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బెంగళూరుకు ఇండిగో విమానం రద్దైంది. కాగా, రానున్న 48 గంటల్లో తేలికపాటి వానలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.