న్యూఢిల్లీ: వివాదాస్పద కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఉద్యమానికి సంబంధించిన పిటిషన్ల విచారణకు తక్షణ ఆవశ్యకత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటిని అత్యవసరంగా విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలో జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వీఎం పంచోలీతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను తగిన సమయంలో విచారిస్తామని పేర్కొంది.
ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని న్యాయవాదులు కోరగా ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. ఈ విషయంలో అంత భావోద్వేగానికి గురికావద్దు అని న్యాయవాదులతో సీజేఐ వ్యాఖ్యానించారు.
తన పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను జాతీయ భద్రతా కారణాలపై సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆన్లైన్లో వైరల్ అయిన వ్యంగ్య రాజకీయ పార్టీకి చెందిన దీప్కే తన పార్టీ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాలు హ్యాక్ అయి ఆ తర్వాత సస్పెండ్ అయ్యాయని కూడా పేర్కొన్నారు.