లక్నో, మే 18: మసీద్లో స్థలం లేదని బహిరంగంగా..రోడ్లపై ప్రార్థనలు చేస్తామంటే కుదరదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విడతలవారీగా ప్రార్థనలు చేసుకోవాలని..ప్రభుత్వ నచ్చచెబు తున్నదని, వినకపోతే మరో పద్ధతిలో వెళ్తామంటూ యోగి ఆదిత్యనాథ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లక్నోలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్న వీడియోను అధికార బీజేపీ ‘ఎక్స్’లో విడుదల చేసింది. దీని ప్రకారం, ‘షిఫ్ట్ల వారీగా నమాజ్ చేసుకోవచ్చు.
రహదారులపైన చేస్తామంటే కుదరదు. ప్రజలకు అసౌకర్యం కలిగించడాన్ని అనుమతించం. రోడ్లున్నది రాకపోకల కోసమే. ఎవరైనా వచ్చి చౌరస్తాలో హంగామా సృష్టించే హక్కు ఎవరికి ఉంది?’ అని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రార్థనకు చోటు కల్పించటంపై సమస్య ఉంటే, విడతల వారీగా నమాజ్ ఏర్పాటు చేసుకోవచ్చు..అని సీఎం యోగి చెప్పారు. అందుకు వాళ్లు ఒప్పుకోకపోతే..మరో పద్ధతిలో తెలియజేస్తామని అన్నారు.