మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే పఠించాలని, అభ్యంతరం లేదన్నారు. అయితే హనుమాన్ చాలీసా మాటున దాదాగిరి చేస్తే మాత్రం సహించేది లేదని సీఎం హెచ్చరించారు. దాదాగిరిని ఎలా అణచాలో తమకు బాగా తెలుసంటూ ఫైర్ అయ్యారు.
తాము పక్కా హిందుత్వవాదులమని సీఎం ఉద్ధవ్ పునరుద్ఘాటించారు. బీజేపీ గనక దాదాగిరి చేస్తే… తమ భీమ రూపాన్ని, మహా రౌద్ర రూపాన్ని చూడాల్సి వస్తుందని సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గదా ధరుడైన హనుమంతుడిలాగా తమ హిందుత్వ భూమిక చాలా స్ట్రాంగ్గా వుందని పేర్కొన్నారు.
తాము హిందుత్వ భూమికను విడిచిపెట్టామని బీజేపీ పదే పదే ప్రచారం చేస్తోందని, మేం ఏం విడిచిపెట్టామో చెప్పాలని సీఎం సవాల్ విసిరారు. హిందుత్వ అంటే కేవలం ధోవతి కట్టుకోవడమేనా? అంటూ ప్రశ్నించారు. హిందుత్వ విషయంలో తమను విమర్శించే వారు.. ఇంతకు వారు హిందుత్వకు ఏం చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఉద్ధవ్ ఎద్దేవా చేశారు.
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పారిపోయారు.. దాక్కున్నారు. రామ మందిరాన్ని నిర్మించాలన్న నిర్ణయం బీజేపీది కాదు. అది కోర్టు ఇచ్చిన తీర్పు. అసలు మీరు ఆచరణలో హిందుత్వ భూమిక ఎక్కడుంది? అంటూ సీఎం ఉద్ధవ్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.