మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు ఎప్పుడూ జెండాలు మారుస్తూ వుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం మరాఠీయేతర వ్యక్తులపై విమర్శలు చేసేవారని, ఇప్పుడు హైందవేతరులను ఎంచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఓ జాతీయ ఛానల్కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రస్తుత యుగమంతా మార్కెట్ యుగమని, ఇది కూడా నడవకుంటే ఇంకో అంశాన్ని మార్కెటింగ్ చేస్తుంటారంటూ సీఎం థాకరే దెప్పిపొడిచారు. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను ఇచ్చిందని, ఇది అన్ని వర్గాల వారికీ వర్తిస్తుందని సీఎం పేర్కొన్నారు.
అందరికీ ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం, అందరూ జీవించేట్లు చేయడం.. రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో నడిపించడం ఇవే తమ లక్ష్యాలని సీఎం ఉద్ధవ్ స్పష్టం చేశారు. తమ పొట్ట నింపాలని ప్రజలు అడుగుతున్నారని, కానీ వారి ముందుండే ప్లేట్లను ఖాళీగా వుంచుతున్నామని అన్నారు. వారికి భోజనానికి బదులుగా లౌడ్ స్పీకర్లు ఇస్తున్నామంటూ సీఎం ఉద్ధవ్ అసహనం వ్యక్తం చేశారు.