కేంద్ర వ్యవహార శైలిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ ముందే తప్పుబట్టారు. కేంద్రం నుంచి తమిళనాడుకు ఏమాత్రం నిధులే రావడం లేదని ప్రధాని ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ గురువారం చెన్నైలో పర్యటించారు. సీఎం స్టాలిన్తో కలిసి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ ముందు కొన్ని డిమాండ్లు వుంచారు.
రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని స్టాలిన్ తేల్చి చెప్పారు. అలాగే తాము నీట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నామని, అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. తమ రాష్ట్రానికి నీట్ నుంచి మినహాయింపును ఇవ్వాలని స్టాలిన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఇక.. హిందీని కాకుండా తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలని స్టాలిన్ ప్రధాని మోదీని కోరారు. మత్స్యకారులు స్వేచ్ఛగా చేపలు పట్టేందుకు వీలుగా శ్రీలంక నుంచి కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను వదులుకోవడంలో ఏమాత్రం సిద్ధంగా లేమని ప్రధాని మోదీ ముందే సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు.