బెంగళూరు: కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయల్ని పోగేస్తున్నదని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్పై వచ్చిన ఆరోపణల్ని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఐటీ దాడులు ఎదుర్కొన్న కాంట్రాక్టర్లకు కాంగ్రెస్కు సంబంధం ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని విలేకర్ల సమావేశంలో సీఎం చెప్పుకొచ్చారు. పార్టీ అధిష్టానం తమను ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు.
ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాల్లో ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక కాంగ్రెస్కు టార్గెట్ పెట్టిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఆ రాష్ట్రంలో కాంట్రాక్టర్లపై జరిగిన ఐటీ దాడుల్లో కోట్ల రూపాయల నగదు కట్టలు బయటపడటం సంచలనం రేపింది. మరోవైపు, కర్ణాటకలో పట్టుబడ్డ నోట్లకట్టలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.