Rameshwaram Cafe | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే మొదట గ్యాస్ సిలిండర్ పేలిందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ఓ గుర్తు తెలియని వ్యక్తి కేఫ్లో ఉంచి వెళ్లిన బ్యాగులో పేలుడు సంభవించినట్లు కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. ఈ విషయాన్ని సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు. ఓ వ్యక్తి కేఫ్లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని తెలిపారు. ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కారణంగానే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు.
ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించిన వెంటనే భయంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు అక్కడికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య.. రామేశ్వరం కేఫ్ ఫౌండర్ నాగరాజ్కు ఫోన్ కాల్ చేశారు. కేఫ్లో గ్యాస్ సిలిండర్ పేలలేదని నాగరాజ్ స్పష్టం చేశారు. బాంబు బ్లాస్ట్ జరిగిందని, ఓ కస్టమర్ వదిలి పెట్టిపోయిన సంచిలో నుంచి పేలుడు సంభవించిందని ఆయన తెలిపారు. కేఫ్ సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడినట్లు నాగరాజ్ పేర్కొన్నట్లు ఎంపీ సూర్య ట్వీట్లో తెలిపారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య పూర్తి వివరణ ఇవ్వాలని ఎంపీ డిమాండ్ చేశారు.