పట్నా : బీజేపీతో జేడీ(యూ) తెగదెంపులు చేసుకోవచ్చనే ఊహాగానాల నడుమ బిహార్ సీఎం నితీష్ కుమార్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో సీఎం అధికార నివాసంలో నితీష్తో ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. 2020లో పార్టీ ఉపాధ్యక్ష పదవి నుంచి జేడీ(యూ) ప్రశాంత్ కిషోర్ను తొలగించిన తర్వాత వీరు సమావేశం కావడం ఇదే తొలిసారి. ఇక ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని సమావేశం అనంతరం నితీష్ వ్యాఖ్యానించారు.
ప్రశాంత్ కిషోర్తో తన అనుబంధం ఈరోజే మొదలైందా అని నితీష్ ప్రశ్నించారు. సమావేశం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణాలు లేవని ఇరువురి భేటీపై సాగిన ఊహాగానాలకు నితీష్ తెరదించారు. మరోవైపు నితీష్ త్వరలోనే మధ్యంతర ఎన్నికలకు వెళతారని ఆయన మధ్యంతర సీఎం అని లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవల వ్యాఖ్యానించారు.
మధ్యంతర ఎన్నికల కోసం నితీష్ సాకులు వెతుకుతున్నారని కూడా పాశ్వాన్ ఆరోపించారు. బీజేపీ నుంచి వేరుపడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. సీఎం పదవి కోసం నితీష్ ఎంతవరకైనా వెళతారని, ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపి 2017లో తీసుకున్న చర్యలతో తిరిగి ముందుకొచ్చినా ఆశ్చర్యం లేదని పాశ్వాన్ పేర్కొన్నారు.