CM Nitish Kumar | పాట్నా : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. నితీశ్తో పాటు రబ్రీదేవి(ఆర్జేడీ), సయీద్ షానవాజ్ హుస్సేన్(బీజేపీ), సంజయ్ కుమార్ ఝా(జేడీ-యూ), ప్రేమ్ చంద్ర మిశ్రా(కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్(హెచ్ఏఎం-ఎస్), మంగళ్ పాండే(బీజేపీ), రామ్ చంద్ర పుర్వే(ఆర్జేడీ), ఖలీద్ అన్వర్(జేడీ-యూ), రామేశ్వర్ మహతో(జేడీ-యూ), సంజయ్ పాశ్వాన్(బీజేపీ) పదవీ కాలం కూడా మే నెలలో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ మార్చి 14. మార్చి 21వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం.. ఆరు స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా ఐదు స్థానాలు మహాఘటబంధన్ గెలిచే అవకాశం ఉంది. జేడీ-యూకు 45 ఎమ్మెల్యేల బలం ఉంది. అంటే ఈ పార్టీకి రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇందులో ఒకరు సీఎం నితీశ్ కుమార్. మరో స్థానం మైనార్టీ కమ్యూనిటీ నాయకుడికి వెళ్లే అవకాశం ఉంది.