Palaniswami: రాష్ట్రంలో ప్రజాదరణ, కార్యకర్తల బలం ఉన్న తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ (MK Stalin) ప్రయత్నిస్తున్నారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) ఆరోపించారు. నైవేలి టౌన్షిప్లో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత కాంస్య విగ్రహాన్ని గురువారం రాత్రి పళనిస్వామి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ.. నైవేలీ టౌన్షిప్లో జయలలిత ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని, ఇప్పుడు తాను ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించానని చెప్పారు. అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేసిన పథకాలను డీఎంకే నిలిపివేసిందని, దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారని వ్యాఖ్యానించారు.
తమ హయాంలో పంట రుణాలు రద్దు చేశామని, రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించామని పళనిస్వామి గుర్తుచేశారు. డీఎంకే తీరుతో ప్రస్తుతం డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ పార్టీ నేతలపై స్టాలిన్ ఎన్ని కేసులు నమోదు చేసినా న్యాయస్థానాన్ని ఆశ్రయించి గెలిచి చూపిస్తామని సవాల్ చేశారు.