Mamatha | నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టినంత మాత్రాన కేంద్రం బాధ్యత అయిపోతుందని భావించుకోవడం కుదరదని అన్నారు. తాము కేంద్రంపై పెడుతున్న ఒత్తిడి కారణంగానే నేతాజీ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారని మమత పేర్కొన్నారు. విగ్రహం పెట్టామని చేతులు దులుపుకుంటే కుదరదని చురకలంటించారు. నేతాజీ ఏ తేదీన మరణించారో ఇప్పటికీ తెలియడం లేదని, అసలు నేతాజీకి ఏం జరిగిందో అన్న విషయమూ ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయిందన్నారు. నేతాజీకి సంబంధించిన ఫైల్స్ను తాము బహిర్గతం చేస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. తాము మాత్రం నేతాజీకి సంబంధించిన ఫైల్స్ను డిజిటలైజ్ చేసి, బహిర్గతం చేశామని మమత పేర్కొన్నారు.
కేంద్రానికి అంత ఎలర్జీ ఎందుకో? మమత చురకలు
నేతాజీకి సంబంధించిన శకటాన్ని కేంద్రం ఎందుకు తిరస్కరించిందని సీఎం మమత మరో మారు మండిపడ్డారు. ఆ శకటం వుంటే కేంద్రానికి వచ్చిన నష్టమేమని సూటిగా ప్రశ్నించారు. గతంలో ఠాగోర్కు సంబంధించిన శకటాన్ని కూడా ప్రతిపాదించామని, దానిని కూడా ఇలాగే తిరస్కరించారని మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి ఈ ఎలర్జీ ఎందుకని మమత అసహనం వ్యక్తం చేశారు.