పంజాబ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేజ్రీవాల్… కేజ్రీవాల్… అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేజ్రీవాల్ తన ఉపన్యాస ప్రారంభంలో భారత్ మాతాకీ జై… భారత్ మాతాకీ జై… ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉపన్యాసం ప్రారంభించారు.
”పంజాబ్ ప్రజలు నేడు ఓ మాయాజాలం చేసేశారు. వీ ఆల్ లవ్యూ పంజాబ్. పంజాబ్ ఫలితాలు ఓ పెద్ద విప్లవం లాంటివి. పెద్ద పెద్ద నేతలే అడ్రస్ లేకుండా పోయారు. సుఖ్బీర్ సింగ్ బాదల్, కెప్టెన్, సీఎం చెన్నీ, ప్రకాశ్ సింగ్ బాదల్, సిద్దూ, విక్రమ్సింగ్ మజీఠియా… వీరందరూ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. పంజాబ్ ప్రజలు ఓ కమాల్ చేశారు. ఇదో పెద్ద విప్లవం. ఆంగ్లేయులను తరిమేసి, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత దేశంలో సిస్టమ్ మారకుంటే ఏం లాభం లేదని భగత్ సింగ్ అనేవారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచీ ఈ పార్టీలన్నీ ఆంగ్లేయుల విధానాన్నే ఇంకా ఫాలో అవుతున్నాయి. దేశాన్ని దోచుకుంటున్నారు. పాఠశాలలు, దవాఖానాలు.. ఇలా వేటినీ నిర్మించలేదు. కావాలనే, ఉద్దేశపూర్వకంగానే ప్రజలను పేదరికంలో ఉంచేశారు. దేశాన్ని దోచుకున్నారు. గత ఏడు సంవత్సరాల్లో ఆమ్ఆద్మీ ఈ సిస్టమ్ను పూర్తిగా మార్చేసింది. నీతి, నిజాయితీల ఆధారంగా రాజకీయాన్ని చేస్తున్నాం. పేద ప్రజలకు మంచి విద్య ఇస్తున్నాం. అంబేద్కర్, భగత్ సింగ్ ఆశయాలను నెరవేరుస్తున్నాం. ఇది సులువైన పనేమీ కాదు మిత్రులారా.. పెద్ద పెద్ద నేతలందరూ దీనిని అడ్డుకుంటున్నారు. పంజాబ్ వేదికగా ఎన్ని కుతంత్రాలు పన్నారో మీకు తెలుసు. ఆప్కు వ్యతిరేకంగా అందరూ ఒక్కటయ్యారు. అధికారులను అటూ ఇటూ బదిలీలు చేశారు. అందరూ గుమిగూడి ఆప్కు వ్యతిరేకంగా పనిచేశారు. అందరూ కూడబలుక్కొని కేజ్రీవాల్ ఓ తీవ్రవాది అని ప్రకటించారు. మిత్రులారా…. ఈ ఫలితాల ద్వారా కేజ్రీవాల్ ఓ సచ్ఛీలుడైన దేశభక్తుడని ప్రజలు నిరూపించారు.
కేజ్రీవాల్ ఓ దేశభక్తుడు. ప్రజలు తమ తీర్పు ఇచ్చేశారు. దేశాన్ని కూడబలుక్కొని దేశాన్ని లూటీ చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాది కాదు. దేశాన్ని దోచుకున్న మీరే ఉగ్రవాదులు. మనమందరమూ కలిసి ఓ కొత్త భారత దేశాన్ని నిర్మిద్దాం. ఒకరినొకరు ప్రేమించుకునే భారత్ను నిర్మిద్దాం. అందరూ కడుపు నిండా అన్నం తినే భారతాన్ని నిర్మిద్దాం. పేద ధనిక లేని భారతాన్ని నిర్మిద్దాం. పేద, ధనికులిద్దరికీ ఒకే రకమైన విద్య అందే భారతాన్ని నిర్మిద్దాం. ఒక విషాదకరం ఏమంటే.. మన పిల్లలు మెడిసిన్ కోసం ఉక్రెయిన్కు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. చాలా చోట్ల మెడికల్ కాలేజీలు ఉండే భారతాన్ని నిర్మిద్దాం. భారత విద్యార్థులు విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లాల్సి రావొద్దు. ప్రపంచంలోని విద్యార్థులే భారత్కు వచ్చేలా చేద్దాం. మహిళలు, పేదలు, వ్యాపారవేత్తలు.. ఇలా… అందరూ ఆమ్ఆద్మీలో చేరండి. ఇతరులు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారో మీకు తెలుసు. ఈ అవినీతిని చూసి మీ గుండెలు తరుక్కుపోతున్నాయనీ నాకు తెలుసు. మొదట ఈ విప్లవం ఢిల్లీలో వచ్చింది. ఇప్పుడు పంజాబ్కి పాకింది. ఇకపై దేశమంతా ఈ విప్లవం విస్తరించాలి. దేశంలోని మహిళలు ఆప్లో చేరాలి. యువకులు, రైతులు కూడా ఆప్లో చేరాలి. మేం చాలా చిన్నవాళ్లం మేం ఏమి చేయగలం అని అనుకుంటున్నారు. కానీ ఆమ్ఆద్మీయే పెద్ద వారిని ఓడించింది. సీఎం చెన్నీని ఎవరు ఓడించారు? బధోరే నుంచి లాభ్సింగ్ ఉగోఖే ఓడించారు. ఈ ఉగోఖే ఎవరు? ఓ మొబైల్ రిపేర్ షాప్లో పనిచేస్తారు. వాళ్ల అమ్మ ఆయాగా పనిచేస్తుంది. వాళ్ల నాన్న ఓ రైతు కూలీ. ఇంతటి సాధారణ వ్యక్తులే చెన్నీని ఓడించారు. సిద్దూను కూడా ఓడించారు. ఆప్ పెద్ద శక్తిమంతమైంది. మేం గెలిచిన చోటల్లా పెద్ద విప్లవాన్నే సృష్టిస్తాం. పెద్ద పెద్ద కుర్చీలే ఓడిపోతాయి.
మీ మీ శక్తిసామర్థ్యాలను తెలుసుకోండి. ఆప్లో చేరండి. 75 సంవత్సరాలు వృథా అయిపోయాయి. ఇక వృథా చేయకూడదు. కాలాన్ని వ్యర్థం చేయవద్దు. ఆమ్ఆద్మీ అంటే పార్టీ కాదు. అదో విప్లవం. భగత్ సింగ్ ఆశయాలను సాధిస్తాం. పంజాబ్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న భగవంత్ సింగ్ మాన్కు శుభాకాంక్షలు ప్రకటిస్తున్నా. పెద్ద విజయాన్ని అందించారు. ఈ విజయం వల్ల ఒక్కోసారి భయమేస్తుంది కూడా. ఎందుకంటే ప్రజలు పెద్ద బాధ్యతలను నెత్తిన పెట్టారు. పెద్ద పెద్ద ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని మాత్రం వమ్ము చేయం. ప్రజల ఆశయాలన్నీ నెరవేరుస్తాం. కార్యకర్తలు అహంకారంతో వ్యవహరించకండి. పూర్తి నమ్రతతో ఉండండి. మనల్ని తిడతారు. ఎన్నికల సమయంలో నన్ను ఎలా తిట్టారో తెలుసు కదా. ఉగ్రవాది అని తిట్టారు. ఆంగ్లేయుడని తిట్టారు. మనం మాత్రం తిట్టుకు తిట్టే సమాధానంలాగా ఉండకూడదు. మనం ఈ దేశ రాజకీయాల్ని మార్చే పనిలో ఉంటాం. ప్రేమ, సేవతో ఉన్న రాజకీయాలను చేద్దాం. ఇప్పుడే హనుమాన్ మందిరం నుంచి వచ్చా. ఆశీర్వాదాల కోసం వెళ్లా. వచ్చేది భారత్ సమయం. ప్రపంచంలో అత్యున్నతగా భారత్ ఎదుగుతుంది. ఎవ్వరూ ఆపలేరు. భారత్ మాతాకీ జై.. ఇంక్విలాబ్ జిందాబాద్..” అంటూ కేజ్రీవాల్ తన ఉపన్యాసాన్ని ముగించారు.