న్యూఢిల్లీ : ఢిల్లీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న క్రమంలో స్టెరాయిడ్ మందులను నిర్ధిష్ట పరిమితిలో వాడాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివిధ దవాఖానాలు, వైద్యులకు విజ్ఞప్తి చేశారు. రోగులు తమ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకోవాలని కోరారు. మోతాదు మించి స్టెరాయిడ్ ల వాడకం, డయాబెటిస్ బ్లాక్ ఫంగస్ కు దారితీస్తున్నాయని అన్నారు.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు మూడు ప్రభుత్వ దవాఖానల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ చికిత్సలో వాడేందుకు తగినన్ని ఇంజెక్షన్లు కేంద్రం ఢిల్లీకి సమకూరుస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ దేవ్ లతో అత్యున్నత భేటీ అనంతరం కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.