ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే వుంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని నెలకోల్పుతామని సంచలన ప్రకటన చేశారు. ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ గురువారం బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
రావణుడి అహంకారం లాగా.. కేంద్రానికి కూడా అహంకారం వుందని విమర్శించారు. అందుకే సాగు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. రైతులను చెలగాటాలొద్దని తాము బీజేపీని పదే పదే హెచ్చరించినా, పెడ చెవిన పెట్టిందని, చివరికి సాగు చట్టాను వెనక్కి తీసుకుందని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. రైతులు చేసిన పోరాటానికి తాను సలామ్ చేస్తున్నానని ప్రకటించారు. తమది దేశభక్తుల పార్టీ అని చెప్పుకొచ్చారు.
నేరస్థులే తిరిగి అధికారంలోకి రావాలని అనుకుంటే కర్నాటక ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. అదే.. పాఠశాలలు, వైద్యశాలలు కావాలంటే మాత్రం ఆప్కు ఓటు వేయండని ఆయన పిలుపునిచ్చారు. తమకు కేవలం నిజాయితీతో ప్రభుత్వాలు నడపడమే తెలుసని, తమది నిజమైన దేశభక్తుల పార్టీ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.