ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలతో చనిపోయిన తొమ్మిదేళ్ల దళిత బాలిక మరణంపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారంగా అందజేయనున్నట్లు చెప్పారు. ఏం చేసినా బాలిక తిరిగిరాదు. బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం మేజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తుందని బాధిత కుటుంబాన్ని కలిసిన అనంతరం సీఎం కేజ్రీవాల్ మీడియాతో తెలిపారు.
ఢిల్లీలో శాంతి భద్రతలను పటిష్ట పరచాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో దోషులకు కఠిన శిక్ష పడేలా ఢిల్లీ ప్రభుత్వం టాప్ లాయర్లను నియమించనున్నట్లు తెలిపారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న వందలాది మంది సంఘటన జరిగిన నంగల్ ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
కుటుంబ సభ్యులతో కలిసి బాలిక సశ్మానవాటిక ముందు ఓ అద్దె గదిలో ఉంటుంది. గడిచిన ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు చల్లని నీళ్ల కోసం తల్లికి చెప్పి సశ్మానవాటిక వద్ద ఉన్న కూలర్ పాయింట్కు వెళ్లింది. కాగా సశ్మానవాటిక పూజారి, బాలిక తల్లికి తెలిసిన మరో ఇద్దరు వ్యక్తులు ఆమెను పిలిచి నీళ్లు పట్టే క్రమంలో మీ కూతురు కరెంట్ షాక్కు గురై చనిపోయిందని చెప్పారు. ఎడమ మోచేయి, మడిమపై కాలిన గాయాలు ఉన్నాయి. పెదాలు నీలం రంగులోకి మారినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులకు చెబితే పోస్టుమార్టం ఉంటుందని, వైద్యులు బాలిక అవయవాలను దొంగిలిస్తారని బాలిక తల్లిని భయాందోళనకు గురిచేశారు. మృతదేహాన్ని కాల్చడమే మంచిదని చెప్పారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్లో అత్యాచార ఆరోపణలు చేర్చారు. పూజారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.