ఆరు ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి
కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గెలుపు
శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం
ముంబై, ఏప్రిల్ 2: బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ల పేర్లను ప్రస్తావించింది. కూటమి ఏర్పాటుకు ఈ సమర్థవంతమైన నేతలు చర్చించుకోవాలని సూచించింది.
కేసీఆర్, ఠాక్రే మధ్య జరిగిన చర్చలను సామ్నా ఈ సందర్భంగా ప్రస్తావించింది. కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గెలుస్తున్నదని, విపక్షాలను కలిపి ఉంచే ప్రయత్నం కూడా కాంగ్రెస్ చేయడం లేదని విమర్శించింది. అయితే, గత రెండేండ్లుగా యూపీఏ గురించి చర్చ వచ్చినప్పుడల్లా శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉండాలని డిమాండ్ చేసిన శివసేన తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహించాలని సామ్నాలో పేర్కొనడం గమనార్హం. మహారాష్ట్రలో అధికారంలో మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య విభేదాలకు ఇది నిదర్శనం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.