CM KCR Speech Highlights | బీఆర్ఎస్ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సర్కోలి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మన దేశానికి ఏదైనా లక్ష్యం ఉందా లేక మనం దారి తప్పి చీకట్లో మగ్గుతున్నామా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అనివార్య సమయం వచ్చిందని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. వీటితో పాటు పలు కీలక అంశాల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారు.
➣ మన దేశానికి ఏదైనా లక్ష్యముందా లేక లక్ష్యం లేకుండా మనం దారి తప్పిపోయామా ? దారి మరిచి చీకట్లో మగ్గుతున్నామా? ప్రతి భారతీయునికి ఈ విషయం పై ఆలోచించాల్సిన అనివార్య సమయమిది.
➣ స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో త్యాగాలు చేస్తే నేడు మనం స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నాము. కానీ నేడు మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని మనం చేపట్టాల్సి ఉన్నది.
➣ నూతనోత్సాహంతో విప్లవం మార్గంలో ఒక కొత్త ఉషోదయం కోసం భారతదేశం ముందుకు సాగాలి.
➣ మనకు స్వాతంత్య్రం లభించి 75 ఏండ్లు అయింది. ఇది తక్కువ సమయమేమీ కాదు.
➣ మన కండ్ల ముందే ఎన్నో దేశాలు గొప్పగా పురోగమించాయి.
➣ సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, మలేషియా, భౌగోళికంగా హిమాలయాలకు ఆవల మన సరిహద్దు దేశమైనా చైనా దేశం ఉంది. 1982 వరకు చైనా మన దేశం కంటే బీద దేశంగా ఉండేది. ఇవాళ చైనా ఎక్కడుంది.. . మనం ఎక్కడున్నాం? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి.
➣ ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఒకరు గెలుస్తారు.. ఒకరు ఓడతారు. ఎన్ని పార్టీలకు మీరు మద్దతు పలికారు.. మహారాష్ట్రలో మీరు అందలం ఎక్కించని ఒక్క పార్టీ పేరైనా చెప్పండి. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ 50 ఏండ్లు పాలించింది. ఆ తర్వాత ఎన్సీపీ, శివసేన, బీజేపీకి అవకాశమిచ్చారు. వీరిలో ఒక్కరైనా మీ ఆకాంక్షలను నెరవేర్చారా?
➣ నూతన రాష్ట్రమైన తెలంగాణలో అతి తక్కువ సమయంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టాం. నాకు మరాఠీ మాట్లాడటం రాదు. కానీ అర్థం చేసుకోగలను. యువ నాయకుడు భగీరథ్ బాల్కే తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి వివరంగా చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు మహారాష్ట్రలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మహారాష్ట్ర ధనవంతమైన నిలకడైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఏం తక్కువైంది?
➣ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ఇక్కడ అమలు చేస్తే, మహారాష్ట్ర దివాళా తీస్తుందని అంటున్నారు. నిజమే దివాళా తీయడం మాత్రం పక్కా. రాజకీయ నాయకులు దివాళా తీస్తారు. ప్రజలు మాత్రం దీపావళి పండుగ చేసుకుంటారు.
➣ ప్రజల్ని భ్రమింప చేసేందుకు కొందరు ఉల్టా పల్టా ప్రశ్నలు అడుగుతున్నారు. మరి మేము డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాం.
➣ బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ అంటున్నారు. బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, భారతదేశంలో పరివర్తన తెచ్చే ఒక మిషన్. ఇది జాతీయస్థాయిలో పనిచేసే పార్టీ.
➣ పండరీపూర్ విఠోభా దర్శనం కోసం నేను బయలుదేరినప్పుడు ఎవరెవరు ఏమేం అన్నారో మీరు పత్రికలు, టీవీల్లో చూశారు. దేవుడి దర్శనం చేసుకోవాలి గానీ రాజకీయాలు చేయవద్దని అంటున్నారు. పుణ్యక్షేత్రమైన దేవాలయంలో జర్నలిస్టులు పలు రకాలుగా ప్రశ్నించినా నేను ఏం మాట్లాడలేదు. కానీ ఇక్కడ తప్పకుంగా మాట్లాడుతాను. మేము ఇప్పుడిప్పుడే మా ప్రస్థానాన్ని ప్రారంభించాం. మిగతా పార్టీలకు మా మీద ఎందుకింత ఆక్రోశం? ఇంత భయమెందుకు ? తొందర పాటెందుకు?
➣ మహారాష్ట్రలో మేం ప్రస్థానాన్ని ప్రారంభించి మూడు నాలుగు నెలలు మాత్రమే అవుతుంది. ఏ పార్టీ మమ్మల్ని వదలటం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రకరకాల ప్రకటనలు చేస్తున్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అని కాంగ్రెస్ అంటున్నది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ టీం అని బీజేపీ చెప్తున్నది. ఈ టీంలు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. మేము ఎవరి టీం కాదు. మేము రైతులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, దళితుల టీం.
➣ ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలో ఎన్నో రకాల నినాదాలిచ్చాయి. కానీ మొట్టమొదటి సారి ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇంతకుముందు ఏ పార్టీ కూడా ఈ నినాదమివ్వలేదు.
➣ 60 శాతం పైగా ఉన్న రైతులు, కార్మికులు తమ మద్దతును బీఆర్ఎస్ పార్టీకి ప్రకటిస్తుండటం వీరికి భయాన్ని కలిగిస్తున్నది. దీంతో అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారు. వింత వింత ప్రకటనలు చేస్తున్నారు.
➣ బీఆర్ఎస్ తెలంగాణకో, మహారాష్ట్రకో పరిమితం కాదు.
➣ ఈనాడు దేశం అన్ని సమస్యలకు పరిష్కారం పరివర్తిత (సంస్కరించబడిన) భారతదేశమే.
➣ భారతదేశంలో 41 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. ఇక్కడ 1.40 లక్షల టీఎంసీల వర్షపాతం సంభవిస్తుంది. దీంట్లో సగం నీరు భాష్పీకరణ ప్రక్రియ ద్వారా ఆవిరిగా మారతుంది. మిగిలిన 70-75 వేల టీఎంసీల స్వచ్ఛమైన నీరు నదుల్లో ప్రవహిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దమ్ముంటే, వారు సరైన విధానాలు అమలు చేస్తే ప్రతీ ఎకరానికి సరిపడా సాగునీటిని అందించవచ్చు.
➣ ప్రభుత్వం తలుచుకుంటే మంగళ్వాడ్లోని 25 నుంచి 35 ప్రాంతాలకు నీటిని తరలించవచ్చనీ, కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఆ సంకల్పం లేదని బాల్కే చెప్పారు.
➣ దేశంలో జలవనరులు సమృద్ధిగా ఉన్నాయి. ఈ నీటితో దేశంలోని ప్రతి ఎకరా పంట భూమికి సాగునీటితో పాటు, ప్రజావసరాలకు తాగునీటిని అందించవచ్చు.
➣ ఔరంగాబాద్ (శంభాజీనగర్) ప్రజలు 8 రోజులకొకసారి నీళ్లు వస్తాయని అంటున్నారు. సోలాపూర్ లో నాలుగైదు రోజులకొకసారి, అకోలాలో 10 రోజులకొకసారి నీళ్లు వస్తాయని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ముంబై, పుణెలకు కూడా నీటి సరఫరాలో కోతలు విధిస్తున్నారని తెలిసింది. అసలు ఏం జరుగుతున్నది ? ఈ దేశంలో నీళ్ళు లేవా?
➣ ఈ దేశ జల విధానాన్ని పెకిలించి నూతన జల విధానాన్ని తేవాల్సిన అవసరమున్నది. ఇదే భారత పరివర్తన. ఇది తప్పకుండా జరిగి తీరాలి. సమృద్ధిగా జల వనరులున్నా మనం ఎందుకు వంచితులుగా మిగిలిపోవాలి?
➣ కరెంటు మరో సమస్య. మూడు నాలుగు రకాలుగా విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. రష్యాలోని చెర్నోబిల్ విపత్తు కారణంగా అణు విద్యుత్ ఉత్పత్తి పై వివాదం నెలకొంది. సోలార్ పవర్, పవన విద్యుత్, జల విద్యుత్ ఉత్తత్తిలో కొన్ని పరిమితులున్నాయి. కానీ థర్మల్ విద్యుదుత్పత్తికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు.
➣ దేశంలో 361 బిలియన్ టన్నులు బొగ్గు నిల్వలున్నాయి. నా మాటలను చర్చించండి. నేను చెబుతున్నది వాస్తవమా కాదా తెలుసుకోండి. అధికారులను అడిగి తెలుసుకోండి. విద్యుదుత్పత్తి విధానాలను కూడా మార్చి, నూతన విద్యుదుత్పత్తి విధానాన్ని తేవాలని బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది.
➣ జల విద్యుత్, సౌర విద్యుత్, థర్మల్ విద్యుత్ లను సమన్వయం చేసి దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, చిన్న చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు సరిపడా విద్యుత్ను అందించవచ్చు. మన దేశంలోని బొగ్గు నిల్వలు 150 సంవత్సరాల పాటు దేశావసరాలను తీర్చగలవు. ఇవి నేను చెబుతున్న లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు.
➣ దేశంలో సమృద్ధిగా బొగ్గు వనరులున్నా రష్యా వంటి విదేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవి లోతైన సమస్యలు.
➣ రైతులంతా ఏకమైతే తప్ప మన సమస్యలకు పరిష్కారం లభించదని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
➣ ధనిక మహారాష్ట్రలో రోజూ ఆత్మహత్యలు చేసుకునే రైతుల సంఖ్య పెరుగుతూ పోతుండటం చాలా బాధను కలిగిస్తున్నది. ఇదేనా మన రైతులు చేసుకున్న అదృష్టం??
➣ రైతులంతా ఏకమైనప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
➣ తెలంగాణ ప్రజలు ఏకమై రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు, రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
➣ తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నది. 50 హార్స్ పవర్ విద్యుత్ను ఉపయోగించుకున్నా, పది పదిహేను మోటార్లు పెట్టుకున్నా రైతులను అడిగేది లేదు.
➣ తెలంగాణలో పంట పెట్టుబడిగా రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి 10 వేల రూపాయలు, రైతు ఏ రకంగా మరణించినా రైతుబీమా పథకం ద్వారా రూ. 5 లక్షలు రైతుకుటుంబానికి అందుతాయి.
➣ రైతులు వారి వారి గ్రామాల్లోనే పంటను అమ్ముకునేందుకు వీలుగా 7 వేలకు పైగా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం.
➣ మహారాష్ట్రలో పంటను అమ్ముకున్న రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నేనున్న ప్రాంతంలో చెరుకు పంటకు మద్దతు ధర కోసం రైతులు పడుతున్న కష్టాలు తెలుసు. దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేకపోతున్నది? శరద్ జోషి కాలం నుంచి ఇందు కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. పంట అమ్ముకున్నాక నాలుగైదు నెలలకు కూడా వారికి డబ్బులు అందని దుస్థితి ఎందుకు?
➣ ఉల్లి పంటకు మద్దతు ధర కోసం వేలాదిమంది రైతులు నాసిక్ నుంచి ముంబై దాకా పాదయాత్ర చేయాల్సిన దుస్థితి. పాదాల నుంచి రక్తం కారుతున్నా వాళ్లను పట్టించుకున్న నాథులు లేరు. సర్కారు స్పందించలేదు.
➣ రైతు ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది. దీంట్లో ఏం అద్భుతం లేదు.
➣ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఏం మార్పు జరిగింది ?
➣ ఎన్నికల్లో ప్రజలు గెలవడం మొదలైనప్పుడే దేశంలో మార్పు సాధ్యమవుతుంది. ఎన్నికలైన మరుసటి రోజు నుంచే వారి కోసం పని మొదలవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అర్థం చేసుకోవాల్సిన విషయం.
➣ “కిసాన్ జీయేగా తో కౌన్ మరేగా, కిసాన్ మరేగా తో కౌన్ జీయేగా (రైతు బతికుంటే ఎవరు మరణిస్తారు, రైతు మరణిస్తే ఎవరు బతుకుతారు) ” అని నేను నిత్యం చెబుతుంటాను. రైతు జీవించి ఉంటేను మన భోజన పాత్రల్లోకి భోజనం వస్తుంది. రైతు మరణిస్తే అందరి భోజన పాత్రలు ఎండిపోతాయి. ఇక ఎవరు బతకగలరు?
➣ పేదింటి బిడ్డకు పెండ్లి నిమిత్తం 1 లక్ష రూపాయలు, విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు 20 లక్షల రూపాయల వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నది.
➣ దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే వికలాంగులకు 3 వేల రూపాయల పెన్షన్ను అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దీన్ని 4 వేల రూపాయలకు పెంచుతామని ప్రకటించాం. దేశంలో 600 రూపాయల పెన్షనిస్తే, తెలంగాణలో 2 వేల రూపాయల పెన్షన్ను అందిస్తున్నాం.
➣ మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కారు ఏర్పడితే రైతులందరికీ పెన్షన్ అందివ్వటంతో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తాం.
➣ అమెరికాలో నల్ల జాతీయుడైన బరాక్ ఒబామాను దేశాధ్యక్షునిగా ఎన్నుకొని ప్రజలు తప్పును సవరించుకున్నారు. భారత్ లో కూడా ఈ రకమైన మార్పు రావాలి. దళితులను ఉద్ధరణ జరగాలి. ఇది మనమే చేసుకోవాలి. ఇది మన దేశ కర్తవ్యం.
➣ గతంలో నేను నాగ్పూర్కు వచ్చినప్పుడు మీకు ఇక్కడేం పని అంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఇక్కడ అమలు చేసి ప్రజల జీవితాలను బాగు చేస్తే నేను ఇక్కడికి రాను, మధ్యప్రదేశ్ కి వెళ్తాను అని చెప్పాను. కానీ ఇక్కడ అమలు చేయరు.
➣ కేంద్ర ప్రభుత్వం రైతులకు 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తుంది. మూడు విడతలుగా ఇచ్చే ఈ పథకానికి అనేక కొర్రీలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతీ రైతుకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలను ఎకరాకు అందిస్తున్నది.
➣ వ్యవస్థకు విపత్తుగా పరిణమించిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల వ్యవస్థను తొలగించి, వారి పొట్ట కొట్టకుండా వేర్వేరు విభాగాల్లో వారికి ఉద్యోగ బాధ్యతలు అప్పగించాం.
➣ తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, రైతులకు పథకాల అమలులో ఎలాంటి కష్టం లేకుండా చేస్తున్నది.
➣ తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు భారతదేశమంతటా ఎందుకు అమలు చేయలేకపోతున్నారు?
➣ భగీరథ్ బాల్కే గారికి మా సంపూర్ణ సహకారం, ఆశీర్వాదం ఉంటుంది. యువ నాయకుడైన భగీరథ్ బాల్కే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే వారికి మంత్రి పదవితో పాటు మరెన్నో ఉన్నతస్థానాలు అధిరోహించే అవకాశం ఉంటుంది. బాల్కే పురోగతి, పండరీపూర్ నియోజవకర్గంతో పాటు యావత్ మహారాష్ట్ర పురోగతికి సంబంధించినది. ఇది అసంభవమైన విషయమేమీ కాదు.
➣ బోయా పేడ్ బబూల్ కా, ఆయే కహా సే ఆమ్ ? ఆమ్ కా అపేక్షా హై తో ఆమ్ కో పౌదా లగానా చాహియే.. కాంటోన్ కా పేడ్ లగాకే, ఫలోం కా అపేక్షా కరేతో నహీ మిలేగా ( తుమ్మచెట్టును నాటితే మామిడి పండ్లు ఎలా కాస్తాయి ? మామిడి పండ్లు తినాలనుకుంటే మామిడి చెట్టునే నాటాలి.. ముండ్ల చెట్టును నాటి, పండ్లు కావాలంటే కుదరదు)
➣గాయ్ సే దూద్ లేనా హై తో గాయ్ కో గాస్ దీజియే, ఘదోంకో గాస్ దేదో ఔర్ గాయోన్ కో దూద్ పూచో తో కహా సే మిలేగా (పాలు కావాలంటే ఆవులకు గడ్డి వేయండి, గాడిదలకు గడ్డి వేసి, ఆవుల నుంచి పాలు ఎలా పొందగలం?)
➣ మీకున్న ఓటు శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు
➣ మనం విభజింపబడక పోయినట్లైతే తప్పకుండా మనం ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి
➣ నేను స్వయంగా రైతును. రైతు కుటుంబంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను.
➣ ఒక రైతుగా నేను రైతుల కష్టాలను, బాధలను అర్థం చేసుకోగలను.
➣ పశ్చిమ మహారాష్ట్రలో ఉచితంగా రైతులకు కరెంటు ఇస్తున్నారా ?
(ఇవ్వటం లేదని రైతుల అరుపులు)
➣ రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నారా ?
(ఇవ్వటం లేదని రైతుల అరుపులు)
➣ గ్రామ రెవన్యూ వ్యవస్థను కొనసాగించాలా ?
(వద్దు.. వద్దంటూ ప్రజలు అరుపులు)
➣ కేంద్రప్రభుత్వం డిజిటల్ ఇండియాను ప్రకటించింది. డిజిటల్ ఇండియా సరైనదే అయితే మహారాష్ట్ర రైతుల కోసం ఈ సౌకర్యాన్ని ఎందుకు కల్పించటం లేదు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు మీరెందుకు అమలు చేయడం లేదు.? రెవెన్యూ వ్యవస్థలోని అక్రమాల నుండి ప్రజలను కాపాడండి. కానీ ఎవరూ ఈ మాటలు చెప్పడం లేదు.
➣ దేశ ప్రధాని మేకిన్ ఇండియా అన్నారు. మేకిన్ ఇండియా అమలైతే ప్రతి చోట చైనా బజార్లు ఎందుకు కనిపిస్తున్నాయి. పతంగుల మాంజాలు, హోళీ రంగులు, దీపావళి పటాకులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయి. భారతదేశంలో వీటిని తయారుచేయలేమా ? ఇంటికెళ్లాక ఈ విషయాల పై ఆలోచించండి.
➣ పరివర్తిత (సంస్కరించబడిన) భారతదేశమే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం
➣ దేశంలో నూతన విధానాలు రావాలి. పారదర్శకత పెంపొందాలి. ప్రజల ముందుంచాలి.
➣ గ్రామ రెవెన్యూ ఉద్యోగులు మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. అయినా జనం బాగు కోసం గ్రామ రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశాం.
➣ మహారాష్ట్రలోని ప్రతి ప్రాంతంలో నేను అడిగితే, గ్రామ రెవెన్యూ వ్యవస్థను తొలగించాలని చెప్పారు.
➣ భూ రికార్డుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ధరణి పోర్టల్ ద్వారా పకడ్బంధీగా రికార్డులను కాపాడుతున్నాం.
➣ కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకాలను మీరెందుకు అమలు చేయడం లేదని నాయకులను అడగండి.
➣ మహారాష్ట్ర ప్రజలు తెలంగాణకు వస్తే అక్కడ అమలవుతున్న పథకాలను స్వయంగా చూపిస్తాం.
➣ 70 కోట్ల మంది రైతాంగం బీఆర్ఎస్ వెంట ఉండగా బీఆర్ఎస్ మరో పార్టీకి టీం ఎలా అవుతుంది?
➣ రైతులు బీఆర్ఎస్ వెంట ఉన్నారా? యుద్ధం చేద్దామా ?
(మీ వెంటే ఉన్నామంటూ రైతుల నినాదాలు)
➣ అబ్ కి బార్ కిసాన్ సర్కార్.. మన యుద్ధంలో న్యాయం ఉంది. తప్పకుండా మనం విజయం సాధిస్తాం. కొద్దిరోజుల్లోనే మహారాష్ట్ర మారుతుంది. రైతుల జీవితాలు మారుతాయి