CM KCR | ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు మారారు కానీ.. ఈ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ ఏర్పాటు చేశాం. దేశ పరిస్థితులు చూసిన తర్వాత టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాం. చత్రపతి శివాజీ, అంబేద్కర్, ఫూలే వంటి మహానీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి ఇది.
దేశంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది. ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు, ప్రధానులు మారారు కానీ దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదు. ఎందరో నేతలు ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఆ మేరకు మార్పులు రాలేదు. కనీసం తాగునీరు, విద్యుత్ కూడా ఇవ్వలేదు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించండి. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎంతో ఆవేదన ఉంటేనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి పంటలు పండించినా చివరకు ఆత్మహత్యలు తప్పట్లేదు. అందుకే అబ్కీ బార్.. కిసాన్ సర్కార్.. నినాదంతో బీఆర్ఎస్ వచ్చింది. దేశ దుస్థితిని చూసిన తర్వాత ఈ స్థితిని మార్చాలని సంకల్పించాం. మా సంకల్పానికి దేశ వ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.